జీహెచ్‌ఎంసీ: విడతల వారీగా ఉద్యోగులకు జీతాలు

by  |
జీహెచ్‌ఎంసీ: విడతల వారీగా ఉద్యోగులకు జీతాలు
X

దిశ, సిటీ బ్యూరో: మహానగర పాలక సంస్థలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఉద్యోగులపై నేరుగా ప్రభావం చూపుతోంది. గత కొంతకాలంగా ఆస్తి పన్ను వసూలైన కొద్ది కాస్త ఆలస్యమైనా ఉద్యోగులందరికీ ఒకే సారి జీతాలను చెల్లించేవారు. కానీ ఆస్తి పన్నును క్షేత్ర స్థాయిలో వసూలు చేయాల్సిన సిబ్బంది వ్యాక్సినేషన్ వంటి ఇతరాత్ర విధులకు వినియోగించటంతో వసూళ్లు కూడా బాగా తగ్గాయి. దీంతో ఉద్యోగులకు జీతాల చెల్లింపు కష్టతరంగా మారింది. గత్యంతరం లేక అధికారులు ఒక్కో నెల మూడు నుంచి నాలుగు స్లాబులుగా ఉద్యోగులను విభజించి వారికి వేర్వేరు తేదీల్లో జీతాలను చెల్లిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు మినహా ఇతర సిబ్బంది మొత్తానికి బల్దియానే జీతాలను చెల్లించాల్సి ఉంది. భవవ నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ వంటివి బల్దియా ప్రధాన ఆర్థిక వనరులు. ప్రస్తుతం వీటి ద్వారా ఆదాయం వస్తున్నా కొద్దీ తేదీలతో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు.

ఈ క్రమంలో తక్కువ జీతాలున్న శానిటేషన్ విభాగంలోని స్వీపర్లు, ప్రైవేటు అటెండర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బందికి ముందుగా ప్రతి నెల 1వ తేదీ నుంచి ఏడెనిమిది తేదీలోపు ముందుగా చెల్లించి, ఆ తర్వాత వారికన్నా ఎక్కువ జీతాలున్న ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. కమిషనర్ తో పాటు బల్దియాలో విధులు నిర్విహిస్తున్న ఐఏఎస్ అధికారుందరికీ రాష్ట్ర ప్రభుత్వం జీతాలను చెల్లిస్తోంది. మొత్తానికి నెల ప్రారంభమై ముగిసే లోపు ఐదు వేల పై చిలుకు ఉన్న కార్పొరేషన్ పర్మనెంట్ ఉద్యోగులకు, సుమారు 18 వేల వరకున్న ఔట్ సోర్సు, కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టు పద్దతిన విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా జీతాలను చెల్లిస్తున్నారు. ఇందులో కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది వివిధ ఏజెన్సీల ద్వారా నియమితులైన వారు కూడా ఉన్నారు. వీరికి ప్రతి నెల కాస్త ఆలస్యమైనా కార్పొరేషన్ జీతాలను చెల్లిస్తున్నా, ఏజెన్సీలు మాత్రం ఇష్టారాజ్యంగా మూడు, నాలుగు నెలలకోసారి జీతాలను చెల్లిస్తున్నా, ప్రశ్నించే వారే కరవయ్యారు.

నెల మొదలై ముగిసే లోపే వర్తమాన నెల జీతాలను చెల్లిస్తున్నా, తమకు ఇబ్బందులు తప్పటం లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. సకాలంలో జీతం రాకపోవటంతో తాము చెల్లించాల్సిన ఈఎంఐలకు అనవసరంగా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోందని వాహనాలు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపరకరణ వస్తువులను వాయిదాల్లో కొనుగోలు చేసిన మరికొందరు ఉద్యోగులంటున్నారు. చిన్న జీతాలు, మధ్య తరహా జీతాలు, భారీ జీతాలుగా మూడు రకాలుగా విభజించి, వీరిలో చిన్న జీతాలు మొదటి వారంలో మధ్య జీతాలు 10 నుంచి 12వ తేదీ లోపు, పెద్ద మొత్తంలో ఉన్నతాధికారులకు చెల్లించాల్సిన జీతాలను 15 నుంచి 17వ తేదీ లోపు చెల్లిస్తున్నారు. ఈ రకంగా కొంతకొంత మందికి కలిపి మొత్తం కార్మికులు, ఉద్యోగులకు, అధికారులకు, ఉన్నతాధికారులకు ప్రతి నెల జీహెచ్ఎంసీ దాదాపు రూ.120 కోట్ల వరకు జీతాలను, మరో రూ.14 కోట్లను రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లుగా చెల్లిస్తుంది. ఏ ప్రాజెక్టు పనులు చేపట్టకపోయినా, రొటీన్ మెయింటనెన్స్ ఖర్చులతో కలిపి జీహెచ్ఎంసీ తనకున్న ఆర్థిక వనరుల ద్వారా ప్రతి నెలా రూ.134 కోట్లను సమకూర్చుకోవల్సిందే! ఈ లెక్కన గమనిస్తే కనీసం రోజుకి వివిధ మార్గాల్లో రూ.4 కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు సమకూర్చుకోవల్సిందే!


Next Story

Most Viewed