వైసీపీలో 'గంటా' మోగేనా ?

by  |
వైసీపీలో గంటా మోగేనా ?
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు రాజకీయ భవితవ్యంపై రాజకీయవర్గాల్లో గత కొన్నిమాసాలుగా చర్చలు షికారు చేస్తున్నాయి. ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని కొందరు వైసీపీ నేతలే ఢంకా బజాయిస్తున్నారు. అదే పార్టీ నేతలు మరికొందరు అసలు సాధ్యం కాదని బల్లగుద్ది వాదిస్తున్నారు. ఎవరి కారణాలు వారికున్నాయి. గతంలో అవినీతి, భూకబ్జాలకు పాల్పడ్డారని విజయసాయి రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. గంటాను పార్టీలోకి రాకుండా మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. గంటా పార్టీలో చేరితే తన ప్రాధాన్యం తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.

మరోవైపు గంటా మరో రూట్లో ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. ఉత్తరాంధ్రలో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టేయాలంటే గంటాను పార్టీలోకి తీసుకోవాలని వైసీపీలో ఓ గ్రూపు పావులు కదుపుతోంది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. గంటాను పార్టీలోకి తీసుకున్నా లేకున్నా వైసీపీకి ఒరిగేదేమీ లేదు. టీడీపీ ఈపాటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలహీనపడింది. గంటా ఉన్నా లేకున్నా ఆపార్టీకి పెద్దగా పోయేదేమీ లేదు. కాకుంటే కష్టకాలంలో పార్టీని వదిలేసిపోయాడనే అపవాదు తప్ప. ఇక గంటా ఏపార్టీలో ఉన్నా ఆ సామాజిక వర్గానికి కొత్తగా ఒనగూడే ప్రయోజనం లేదు.

ఇంకోవైపు కాపు సామాజికవర్గంతో రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్న బీజేపీ గంటాను చేర్చుకోవాలని భావిస్తోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించాలనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ గంటా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంతకీ ఆయన మనసులో ఏముందో ఇంతవరకు బయటపెట్టలేదు. అప్పటిదాకా గంటా శ్రీనివాసరావు రాజకీయ భవితవ్యంపై చర్చలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.



Next Story

Most Viewed