గాంధీ జయంతి రోజే జాతిపితకు అవమానం

by  |
గాంధీ జయంతి రోజే జాతిపితకు అవమానం
X

దిశ, జడ్చర్ల : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు గాంధీ ట్రస్ట్ భూమిలో ఆయన విగ్రహం పెట్టడానికి అనుమతులు లేవంటూ అధికారులు అడ్డుకొని ఘోరంగా అవమానపరిచిన సంఘటన శనివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ పేరుపై ఉన్న ట్రస్ట్ భూమిలో అఖిలపక్ష నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు రసాభాసగా మారింది. శనివారం గాంధీ జయంతి సందర్భంగా జడ్చర్ల పట్టణంలో గాంధీ ట్రస్టు భూమిలో అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహావిష్కరణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో విగ్రహావిష్కరణ చేపడుతున్న స్థలానికి చేరుకున్న స్థానిక తహసీల్దార్, పోలీసులు, అధికారులు ఈ స్థలంలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ కు ఎలాంటి అనుమతులు లేవని విగ్రహావిష్కరణ ఏర్పాటును అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

జాతిపిత పేరుపై ఉన్న ట్రస్టులోనే ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం తప్పేంటని, పట్టణంలో నెలకొల్పిన విగ్రహాలలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయి. మీరు ఎన్ని విగ్రహాలకు అనుమతులు ఇచ్చారని సుమారు రెండు గంటలకు పైగా అఖిల పక్ష ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో చేసేది ఏమీ లేక తహసీల్దార్, పోలీసులు పక్కకు తప్పుకోవడంతో విగ్రహావిష్కరణ నిర్వహించారు. అనంతరం ప్రజా సంఘాల అఖిలపక్ష నాయకులు.. మాట్లాడుతూ గాంధీ ట్రస్టుకు సంబంధించిన భూమిలో గాంధీ విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు. గాంధీ ట్రస్ట్ భూమిని ఆక్రమించిన భూ బకాసురులకు అధికారులు వంత పాడడం సరైన చర్య కాదని అన్నారు. 19 ఎకరాల ట్రస్ట్ భూమి అన్యాక్రాంతం కాగా మిగిలిన మూడు ఎకరాల భూమినన్నా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ స్థలంలో గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేపట్టడం జరిగిందని తెలిపారు.

మిగిలిన ట్రస్ట్ భూమిని అన్యాక్రాంతం కాకుండా కబ్జా కొరకులను అడ్డుకుంటామని అన్నారు. గాంధీ జయంతి రోజు గాంధీ ట్రస్ట్ పేరిట ఉన్న స్థలంలో గాంధీ విగ్రహావిష్కరణ చేపట్టకుండా అడ్డుకున్న ఘనత జడ్చర్ల రెవెన్యూ పోలీసు అధికారులకే దక్కిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల అఖిలపక్ష నాయకులు అనిల్ కుమార్, అనిరుద్ రెడ్డి, తెలుగు సత్తయ్య, భాగి కృష్ణయ్య, శ్రీనివాసులు, నిత్యానందం, బాల వర్ధన్ గౌడ్, అయ్యన్న, ఖయ్యుం, ఆనంద్, కృష్ణయ్య, ప్రజా సంఘాల, అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.


Next Story