‘డబుల్’ పెచ్చులూడుతున్నాయ్.. నమ్మించి మోసం చేశారంటున్న లబ్దిదారులు

by  |
‘డబుల్’ పెచ్చులూడుతున్నాయ్.. నమ్మించి మోసం చేశారంటున్న లబ్దిదారులు
X

దిశ, కూకట్​పల్లి : పేదవారి సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్​ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కొరవడింది. ఇండ్లు నిర్మించి రెండేళ్లు గడువక ముందే సవాలక్ష సమస్యలతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంత చేస్తాం.. ఇంత చేస్తాం అంటూ డబుల్​ బెడ్​ రూం ఇండ్ల నిర్మాణ బాధ్యతలను బడా సంస్థకు అప్పజెప్పి సర్కారు చేతులు దులుపుకుంటే.. సదరు సంస్థ మరొకరికి సబ్​ కాంట్రాక్టు ఇచ్చి నాణ్యతకు తిలోదకాలు వదిలింది. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపం కారణంగా డబుల్​ ఇళ్లు పూర్తిగా అధ్వాన్నంగా తయారయ్యాయి.

కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్​, నర్సాపూర్​ కూడలిలో ఎకరం స్థలంలో గత మూడు దశబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న చిత్తారమ్మ బస్తీ ప్రజలు వంద మందికి సొంత ఇండ్లను కట్టిస్తామని మొట్టమొదటి సారిగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గుడిసెలను తొలగించి ఆ స్థలంలో డబుల్​ బెడ్​రూం ఇండ్లను నిర్మించారు. 2015 అక్టోబర్​ 22వ తేదిన దసర కానుకగా చిత్తారమ్మ బస్తీలో అప్పటి రవాణ శాఖ మంత్రి మహేందర్​ రెడ్డి చేతుల మీదుగా డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణానికి సుమారు 9.34 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. 2016లో నిర్మాణ పనులను ప్రారంభించి 2019లో పూర్తి చేశారు. 2019 నవంబర్​ 14వ తేదిన డబుల్​ బెడ్​రూం ఇండ్లను మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా ప్రారంభించి, లబ్దిదారులకు అందజేశారు.

అధ్వాన్నంగా ఇండ్లు, ఆవరణ :

డబుల్​ బెడ్​రూం ఇండ్లలో గృహ ప్రవేశం చేసిన సంతోషం లబ్దిదారులకు ఎంతో కాలం నిలవలేదు. ఇండ్లలో డ్రైనేజీ లీకులు, సిమెంట్​ ఫ్లోరింగ్​ నాణ్యత లోపించడంతో గుంతలు ఏర్పడ్డాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు గోడలు చెమ్మగిల్లి నీరు కారుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. కొంత మంది తమ స్థోమతను బట్టి ఫ్లోరింగ్​ తీసేసి టైల్స్​ వెయించుకోగా, మిగిలిన వారు పెచ్చులు లేసి అధ్వాన్నంగా ఉన్న ఫ్లోర్‌తోనే సర్దుకుపోతున్నారు.

కారుతున్న వాటర్ ట్యాంక్​ :

తొమ్మిది అంతస్థుల నిర్మాణంలో మొత్తం 105 ఇండ్లను ప్రభుత్వం నిర్మించగా అందులో ప్రస్తుతం మొత్తం 94 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కాగా అందరికీ నీటి వసతి కోసం నిర్మించిన నీటి ట్యాంకుల లీకేజీతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. కాంట్రాక్టర్​కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా పైపైన సిమెంట్​ పూసి, తాత్కాలిక మరమ్మత్తులు చేయించాడని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా మిద్దెపై గుంతలు, బీటలకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో మిద్దె పై భాగం పూర్తిగా అతుకులుగా మారి దర్శనమిస్తోంది.

సబ్​ కాంట్రాక్ట్ ​:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణ పనులను ప్రముఖ సైబర్​ సిటీ డెవలపర్స్ అనే నిర్మాణ​ సంస్థ చేజిక్కించుకుంది. తర్వాత సైబర్​ సిటీ సంస్థ సుకుమార్​ అనే మరో వ్యక్తికి సబ్​ కాంట్రాక్ట్​ కింద నిర్మాణ పనులను అప్పగించింది. దీంతో సదరు కాంట్రాక్టర్​ తన ఇష్టారాజ్యాంగ నిర్మాణ పనులను నాసిరకంగా పూర్తి చేసి మమ అనిపించాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా లబ్దిదారులు సైబర్​ సిటీ నిర్మాణ సంస్థకు, సుకుమార్​ అనే వ్యక్తికి ఫోన్​ చేస్తూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

వర్షపు నీరు ఇంట్లోకి వస్తోంది : ఏ. శరణ్య

కొద్ది పాటి వర్షం పడినా ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి. గోడలన్ని తడిగా మారుతున్నాయి. వర్షాలు పడినన్ని రోజులు ఇళ్లంతా తేమగా మారుతోంది. ఇంట్లోని బాత్రూం గోడలు, బాల్కనీ ప్రాంతంలో గోడలు చెమ్మగిల్లి పేయింటింగ్​ అంత పెచ్చులుగా ఊడిపోతుంది.



Next Story

Most Viewed