పడిపోయిన దేశీయ ఇంధన డిమాండ్

by  |
పడిపోయిన దేశీయ ఇంధన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి చివరి నాటికి భారత్‌లో ఇంధన డిమాండ్ భారీగా క్షీణించింది. గత రెండు దశాబ్దాల్లో మొదటిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం కుదించుకుపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు శుక్రవారం వెల్లడించాయి. కరోనా, లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో 1998-99 నాటి స్థాయికి ఇంధన వినియోగం పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 21.4 కోట్ల టన్నుల డిమాండ్‌తో పోలిస్తే 2020-21లో భారత్ 19.4 కోట్ల టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించినట్టు చమురు మంత్రిత్వ శాఖ పెట్రోల్యం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్(పీపీఏసీ) పేర్కొంది.

దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిం ఈ డిమాండ్ క్షీణతకు ప్రధాన కారణంగా నిలిచింది. సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వినియోగం 12 శాతం తగ్గి 7.27 కోట్ల టన్నులకు చేరుకోగా, పెట్రోల్ డిమాండ్ 6.7 శాతం తగ్గి 2.79 కోట్ల టన్నులకు చేరుకుంది. దేశీయ వంట గ్యాస్ ఎల్‌పీజీ రిటైల్ ఇంధనం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో 2.67 కోట్ల టన్నుల నుంచి 2020-21లో 4.7 శాతం పెరిగి 2.75 కోట్ల టన్నులకు పెరిగింది. విమానాలకు వాడే జెట్ ఇంధనం(ఏటీఎఫ్) వినియోగం 53.6 శాతం తగ్గి 37 లక్షల టన్నులకు చేరుకుంది. గతేడాది కరోనా ప్రారంభమైనప్పటి నుంచే చాలా విమానయాన సంస్థలు మూతపడటంతో ఏటీఎఫ్ ఇంధనం అధిక క్షీణతను నమోదు చేసింది.



Next Story