స్ట్రాస్ నుంచి పాత్రల వరకు.. అన్నీ ఎకో ఫ్రెండ్లీ

by  |
స్ట్రాస్ నుంచి పాత్రల వరకు.. అన్నీ ఎకో ఫ్రెండ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: సస్టెయినెబుల్ లివింగ్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్న మాట. రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం, పెచ్చుమీరిన ప్లాస్టిక్ వినియోగం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం ఖాయమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సహజ వనరులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సస్టెయినెబుల్ ప్రొడక్ట్స్ వాడాలని సూచిస్తున్నారు. మరోవైపు కొవిడ్ కంటే ముందు నుంచే మానవాళిని పెనుభూతంలా పీడిస్తోన్న ప్లాస్టిక్ మహమ్మారి యూసేజ్‌ను తగ్గించాలని అనుకుంటున్నా, ఇంకా పెరిగిపోతూనే ఉంది. ఈ విషయాలన్నిటినీ గమనించిన ‘నిఖిత సొంఖియా’ అనే మహిళ.. తన కార్పొరేట్ జాబ్‌ను వదిలేసి, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా డెయిలీ యూజ్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అందించేందుకు ‘మైఆన్ఎర్త్’ (MyOnEarth) అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. మరి నిఖిత ఏయే ప్రొడక్ట్స్ అందిస్తోంది? వాటితో పర్యావరణ పరిరక్షణ సాధ్యమేనా? ఇంతకీ ఆమె లక్ష్యం ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీలో ప్రారంభమైన ఈ సంస్థలో తయారయ్యే ప్రొడక్ట్స్ అన్నింటిని ‘వెదురు, కొబ్బరి పొట్టు, కొబ్బరి చిప్ప’ వంటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇక వంటింట్లో ఉపయోగపడే కత్తులు, కోలలు మొదలైన వంట సామగ్రితో పాటు ఇంటి డెకరేషన్‌కు సంబంధించిన, వ్యక్తిగత వస్తువులు భద్రపరుచుకునే ఐటంలు, స్టేషనరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. వెదురు టూత్ బ్రష్, సీడ్ ప్లాంట్స్ కూడా రూపొందిస్తున్నారు. ఉత్పత్తుల తయారీకి ముడి సరుకును వ్యవసాయ మిగులు నుంచి తీసుకుంటున్నారు. అయితే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రజలు వాడకపోవడానికి ప్రధాన కారణం.. అవి సమంజసమైన ధరలకు మార్కెట్‌లో లభించకపోవడమేనని నిఖిత తెలిపింది. అందుకే తాను ప్రొడక్ట్స్‌ను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మకుండా లోకల్ స్టోర్లలో లభ్యమయ్యేలా ఏర్పాటు చేస్తానని వివరించింది. ఎక్ ఫ్రెండ్లీ మార్కెట్ భారత్‌లో ఇంకా ప్రారంభ దశలో, అసంఘటిత రంగంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే కాన్సంట్రేట్ చేసినట్లు పేర్కొంది.

‘మైఆన్‌ఎర్త్’ సంస్థ పర్యావరణ హిత ఉత్పత్తులను తయారు చేయడం మాత్రమే కాకుండా గ్రామీణ భారతంలోని మహిళా కళాకారులకు ఉపాధి కూడా కల్పిస్తోంది. గ్రామీణ మహిళలకు సాధికారికత కల్పించడం కోసం సంస్థ.. జైపూర్ ఎన్జీవోతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ఎన్జీవో పార్టనర్‌షిప్ ద్వారా 50 మంది కళాకారులకు డిజైన్, హస్తకళల వర్క్ కేటాయిస్తోంది. కొవిడ్ పాండమిక్ సమయంలోనూ సంస్థ లాభాల బాటలోనే నడిచింది. అయితే సస్టెయినెబుల్ లివింగ్ అనేది మాత్రం ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నప్పుడే సాధ్యమవుతుందని, సమాజంలోని ఏదో ఒక వర్గానికి ఈ ప్రొడక్ట్స్ పరిమితం కాకుండా అందరికీ చేరువయ్యేలా చేయడం తన సంస్థ లక్ష్యమని నిఖిత తెలిపింది.



Next Story

Most Viewed