28 ఏళ్ల తర్వాత ఇద్దరు మిత్రులకు జాక్‌పాట్!

by  |
28 ఏళ్ల తర్వాత ఇద్దరు మిత్రులకు జాక్‌పాట్!
X

దిశ, వెబ్‌డెస్క్ :
స్నేహితులు అందరికీ ఉంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. మనం వారితో సంతోషం, బాధ, ఓటమి, గెలుపు.. ఇలా ప్రతి ఒక్కటీ షేర్ చేసుకుంటాం. అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన టామ్ కుక్‌, జోయ్ ఫీనీ కూడా అలాంటి ప్రాణ స్నేహితులే. చిన్నప్పుడు అందరిలానే వీరికి బాగా డబ్బు సంపాదించాలనే ఆశ ఉండేది. అందుకోసం వీరిద్దరూ ‘లాటరీ’ టికెట్‌లు కొని తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవాళ్లు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు మిత్రులు ఓ కండిషన్ పెట్టుకున్నారు. ఇద్దరిలో ఎవరికి జాక్‌పాట్ వచ్చినా.. ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకోవాలనుకున్నారు. ఇక అప్పటి నుంచి ఎక్కడపడితే అక్కడ లాటరీలు కొనేవాళ్లు, కానీ విధి వెక్కిరించేది. రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరూ తమ తమ జీవితాల్లో హాయిగా గడుపుతున్నారు. అయితే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరిలో ఒకరికి లాటరీ తగిలింది. దీంతో ఆ ఫ్రెండ్ చిన్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం లాటరీలో సగం డబ్బును తన మిత్రునికి పంచిఇచ్చి నిజాయితీని చాటుకున్నాడు.

ఒక్కసారి అలా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. అది 1992వ సంవత్సరం. టామ్, జోయ్‌లు లాటరీ కొన్నారు. లాటరీ వస్తే.. చెరి సగం అని ఆ రోజే ఒకరికొకరు మాట ఇచ్చుకున్నారు. కట్ చేస్తే.. 2020.. ఇద్దరు స్నేహితుల్లో టామ్ కుక్‌కు గత జూన్ నెలలో పవర్‌బాల్ జాక్‌పాట్‌లో ఏకంగా 22 మిలియన్ డాలర్లు(రూ. 164 కోట్లు) గెలుచుకున్నాడు. వెంటనే టామ్‌కు తన స్నేహితుడు.. జోయ్ గుర్తొచ్చాడు. 28 ఏళ్ల క్రితం అతడికి ఇచ్చిన మాట కూడా టామ్‌కు గుర్తుంది. వెంటనే జోయ్‌కు ఫోన్ చేసి.. మిత్రమా మనకు లాటరీ వచ్చింది.. నీ సగం అమౌంట్ తీసుకెళ్లు అని ఆనందంతో చెప్పాడు. కానీ జోయ్ నమ్మలేదు. తన ఇంటికి రమ్మనడానికి అలా చెబుతున్నానని అనుకున్నాడు. కానీ ఇంటికి వచ్చిన జోయ్.. నిజంగా డబ్బులు ఇవ్వడానికే పిలిచాడని తెలిశాక.. తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు తన స్నేహితుని నిజాయితీకి, మంచితనానికి పొంగిపోయాడు. టామ్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇద్దరూ అనుకున్నట్లుగానే లాటరీ మనీని చెరి సగం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు మిత్రుల లాటరీ కథ.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed