ఉచిత విద్యుత్‌కు అర్హులు వీరే.. దరఖాస్తు చేసుకొండీలా..!

by  |
Free electricity
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : సెలూన్, లాండ్రీలు, దోబీఘాట్ లకు ఉచిత కరెంటు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 250 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారిక ఉచితంగా విద్యుత్ అందిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పథకం నెలకు 250 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసే నాయిబ్రాహ్మణులు, రజకులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి దీనిని అమలు చేయనున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులు బీసీ సంక్షేమ శాఖలోని సీజీజీ ఆన్ లైన్ పోర్టల్ లోని www.tsobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కావలసిన ధ్రువపత్రాలు ఇవే…

తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం, లేబర్ లైసెన్స్, సెలూన్/ లాండ్రి/ దోబీఘాట్ ఫొటోలు, ఆధార్ కార్డు జతచేయాలి. లబ్ధిదారులు సొంత కమర్షియల్ విద్యుత్ మీటర్ కలిగి ఉండాలి. లేని వారు సొంత ఖర్చులతో కొత్త కమర్షియల్ మీటర్ విద్యుత్ కనెక్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. విద్యుత్ సర్వీస్ నెంబర్ ప్రస్తుతం, లేక కొత్త విధానానికి సంబంధించిన బిల్లు వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్ లో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంలో పొందుపర్చాలి. ఒకవేళ లబ్ధిదారులు ఒక కనెక్షన్ కంటే ఎక్కువ కలిగి ఉన్నట్లయితే ఈ పథకం ఒక కనెక్షన్ కు మాత్రమే వర్తిస్తుంది. లబ్ధిదారులు విద్యుత్ ను ఉద్ధేశించిన పథకానికి మాత్రమే వినియోగించాలి. ఇతర అవసరాలకు వినియోగించరాదు.

హెయిర్ కటింగ్ సెలూన్, లాండ్రీ , దోబీఘాట్ లకు సంబంధించిన నాయిబ్రాహ్మణులు, రజక కులస్థులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే విద్యుత్ కనెక్షన్ లబ్ధిదారుని పేరు మీదనే ఉండాలి. ఒక వేళ అద్దె దుకాణాలు, ప్రాంతాలలో ఉన్నట్లయితే యజమాని, లబ్ధిదారుని మధ్య ఒప్పందం తెలిపే లీజ్ అగ్రిమెంట్ /రెంటల్ అగ్రిమెంట్ ధ్రువపత్రాలు జతపర్చాలి. 250 యూనిట్లకు మించి వినియోగించినట్లయితే మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు వారి యూనిట్లను నిలిపి వేసినా, ఇతర ప్రాంతాలకు తరలించినా ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బీసీ సంక్షేమ శాఖ , డిస్కంకు తప్పనిసరిగా తెలపాలి.

గ్రేటర్ లో సుమారు 18 వేల దుకాణాలకు లబ్ధి…

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 18 వేల వరకు సెలూన్లు ఉండగా వీటిల్లో 50 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. కనీసం 2 లక్షల మంది వీరిపైన ఆధారపడి ఉన్నారు. మరోవైపు తెలంగాణ అంతటా 10 లక్షల మంది కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వీరికి ఎంతో ఊరటనివ్వనుంది.



Next Story