వదిలేసి తప్పుచేశారా?.. కానీ, సత్తా చాటారు!

by  |
వదిలేసి తప్పుచేశారా?.. కానీ, సత్తా చాటారు!
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 13వ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో చాలా జట్లు కొంత మంది ఆటగాళ్లను వదిలేశాయి. లీగ్‌లో వాళ్ల ధర పెరగడమో, గత సీజన్లలో రాణించకపోవడమో కారణంగా చూపి చాలా మందిని వేలంలో పెట్టారు. అలా ఇతర జట్లు వదిలేసిన కొంత మంది ఆటగాళ్లను కొన్న ఫ్రాంచైజీలు విశేషంగా లాభపడ్డాయి. అందరూ కాకపోయినా.. ఈ సీజన్‌లో ఒక ఐదుగురు ఆటగాళ్లు మాత్రం ఆకట్టుకున్నారు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఆ ఐదుగురు ఆటగాళ్లెవరో ఒకసారి పరిశీలిద్దాం..

మార్కస్ స్టొయినిస్:

గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడిన మార్కస్ స్టొయినిస్ ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఢిల్లీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్బుతంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా.. తన బంతితో ప్రత్యర్థిని కట్టడి చేసి సూపర్ ఓవర్‌కుతీసుకొని వెళ్లాడు. ఢిల్లీ విజయాలు ఆ మ్యాచ్ నుంచే ప్రారంభమయ్యాయి.

రవిచంద్రన్ అశ్విన్ :

టీమ్ ఇండియా జట్టులో సీనియర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ గత ఏడాది కొన్ని మ్యాచ్‌లకు పంజాబ్ జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ అతడిని సీజన్ మధ్యలోనే అర్దంతరంగా కెప్టెన్సీ నుంచి తొలగించారు. అంతే కాకుండా ఫ్రాంచైజీ నుంచి విడుదల చేసి వేలంలో పెట్టారు. ఈ క్రమంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఎంతో అనుభవజ్ఞడైన అశ్విన్.. పవర్ ప్లేలో కూడా వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు. ఈ సీజన్‌లో 13 వికెట్లు తీసిన అశ్విన్ ఢిల్లీ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ట్రెంట్ బౌల్ట్:

ముంబయి ఇండియన్స్ తరపున ఆడుతున్న ట్రెంట్ బౌల్ట్ ఈ సీజన్‌లో 22 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన బౌల్ట్‌ను ఈ సారి ముంబయికొనుగోలు చేసింది. కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. బుమ్రా, ప్యాటిన్సన్‌తో కలసి ముంబయి పేస్ దళాన్ని నడిపిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో బౌల్ట్ బౌలింగ్‌ను అభిమానులు మర్చిపోలేరు.

మహ్మద్ షమి :

ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన మరో తప్పిదం మహ్మద్ షమీని వదులు కోవడం. టీమ్ ఇండియాలో కీలక బౌలర్‌గా ఉన్న షమీని పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ పంజాబ్ జట్టు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. సీజన్ ప్రథమార్దంలో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా షమీ ఉన్నాడు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ పంజాబ్ జట్టుకు అండగా నిలిచాడు. అద్భుతమైన యార్కలు వేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 20 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

సామ్ కర్రన్ :

గత సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఆడిన సామ్ కర్రన్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో అతడిని పంజాబ్ జట్టు వేలంలో పెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ యువ ఆల్‌రౌండర్‌ను వేలంలో కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో చెన్నై తరపున అత్యంత నిలకడైన ప్రదర్శన చేసింది ఒక్క సామ్ కర్రన్ మాత్రమే. బంతితో పాటు బ్యాట్‌తో కూడా జట్టుకు సేవలు అందించాడు.



Next Story