ఏపీలో విషాదం.. విహారయాత్రకు వెళ్లి నలుగురు మృతి

by  |
swimming
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో విషాదం నెలకొంది. అనంతపురం జిల్లాలో చెరువులో పడి ప్రమాదవశాత్తు నలుగురు మరణించారు. వివరాల్లోకి వెళ్తే అనంతపురం టౌన్ సూర్యానగర్ కి చెందిన ఆరుగురు వ్యక్తులు విహారయాత్రలో భాగంగా పెనుకొండలోని భోగసముద్రం చెరువు వద్దకు వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకించారు. అనంతరం సరదాగా స్నానం చేసేందుకు చెరువులో దిగారు. ఎంజాయ్ చేస్తూ చెరువులో మరింత ముందుకు వెళ్లారు. అక్కడ లోతు ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని వారు గమనించలేదు.

ఈత రాకపోవడంతో వారు చెరువులో మునిగిపోయారు. మిగిలిన వారు కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు స్థానికులు చెరువులో దూకి ఇద్దరిని రక్షించారు. మిగిలిన వారి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. కాసేపటికి నలుగురు మృతదేహాలు నీటిలో తేలాయి. మృతులు తస్లీమా(14), సాధిక్(40), అల్లాబక్ష్(45), పాషా (17)గా గుర్తించారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసుల విచారణలో తేలింది. చెరువులలో ఒకేకుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో స్థానికంగా విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.



Next Story