ట్రావెల్స్ బస్సుల్లో 60 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్టు

by  |
ట్రావెల్స్ బస్సుల్లో 60 కేజీల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్టు
X

దిశ, కోదాడ : ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా ట్రావెల్స్ బస్సులలో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని శనివారం కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ శివరాం రెడ్డి కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ మోహిద్ ప్రస్తుతం మియాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడు శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి మియాపూర్ వెళ్లే బస్సులో 30 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన సూరజ్ వేరొక బస్సులో నర్సీ పట్నం నుంచి హైదరాబాద్‌కు 12 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్, అక్షయ్‌లు శ్రీకాకుళం నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న వేరొక బస్సులో 18 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. వీరంతా ఆయా ప్రాంతాలలో వేర్వేరు వ్యక్తులు నుంచి గంజాయిని కొనుగోలు చేసి దానిని ఎవరికీ అనుమానం రాకుండా బస్సులలో తరలించే ప్రయత్నం చేశారు.

శనివారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్‌లో రూరల్ సీఐ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ సైదులు గౌడ్ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేయగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాస శర్మ సమక్షంలో పంచనామా నిర్వహించి వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్టు సీఐ తెలిపారు. వాహనాల తనిఖీ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి భారీగా గంజాయిని పట్టుకున్న కోదాడ రూరల్ పోలీస్ సిబ్బంది నిరంజన్, సురేష్, వెంకటనారాయణ, చంద్రశేఖర్, బాలాజీ, సుధాకర్ ప్రభాకర్ రెడ్డి, హోంగార్డులు సురేష్, రామ సైదులును ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ రఘు అభినందించారు.


Next Story

Most Viewed