చర్లలో నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్ట్

by  |
Maoist militia Members
X

దిశ, భద్రాచలం: మావోయిస్టు పార్టీ‌ చర్ల ఏరియా కమిటీకి అనుబంధంగా మిలీషియాలో పనిచేస్తున్న నలుగురిని చర్ల పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం చర్ల మండల పరిధిలోని బత్తినపల్లి – రామచంద్రపురం గ్రామాల మధ్య అటవీ ప్రాంతలో చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు.

వీరు చర్ల మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన కుంజం దేవయ్య, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పుట్టపాడుకి చెందిన కలుము సురేశ్, బీజాపూర్ జిల్లా మెట్టగూడ గ్రామానికి చెందిన కొవ్వాసి చుక్క, బీజాపూర్ జిల్లా ఇర్రపల్లికి చెందిన పొడియం మాసయ్య అనే ఈ నలుగురు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

మిలీషియా కమాండర్ వెట్టి దేవా అలియాస్ బాలు ఆధ్వర్యంలో మావోయిస్టు పార్టీకి పని చేస్తూ, చర్ల పోలీస్‌‌స్టేషన్ పరిధిలో జరిగిన పలు విధ్వంసకర సంఘటనలలో నిందితులుగా ఉన్నారని ఏఎస్పీ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో చర్ల సీఐ బి.అశోక్, ఎస్ఐ టి.వెంకటప్పయ్య, సీఆర్పీఎఫ్ అధికారి పాల్గొన్నారు.

Next Story