'అక్రమ అరెస్టులను ఖండించాలి'- ఫోరం ఫర్ సోషల్ ఛేంజ్

by  |

దిశ, న్యూస్ బ్యూరో : ప్రొఫెసర్ ఆనంద్ తేల్‌తుంబ్డే, జర్నలిస్టు గౌతమ్ నవ్‌లఖా అరెస్టులను ఖండించాల్సిందిగా ప్రజాస్వామిక, లౌకికవాదులను, మేధావులను ఫోరం ఫర్ సోషల్ ఛేంజ్ కోరింది. దేశంలో కుల వివక్షతకు వ్యతిరేకంగా, సమానత్వం, ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న వారిద్దరినీ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజునే అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఫోరం ప్రకటన విడుదల చేసింది. తేల్‌తుంబ్డే ప్రస్తుతం గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా.. ఖరగ్ పూర్ ఐఐటీ, పెట్రోనెట్ ఇండియాలో ఎండీగా పనిచేశారు. భారతదేశంలో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్నవారిలో తేల్‌తుంబ్డే ముందు వరుసలో ఉంటారు. గౌతమ్‌ నవ్‌లఖా పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమక్రాటిక్ రైట్స్‌లో క్రియాశీలక సభ్యుడు. కశ్మీర్, చత్తీస్‌ఘడ్ రాష్ర్టాల విషయంలో మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. దేశమంతా కరోనా వైరస్ భయాలతో లాక్‌డౌన్ విధించిన సందర్భంలో వీరిని అరెస్టు చేయడం ప్రజాస్వామిక విరుద్ధమని ఫోరం స్పష్టం చేసింది. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. వారి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని విడుదల చేయాలని కోరింది.

తప్పుడు కేసులతో వారిద్దరిని అసందర్భంగా అరెస్టు చేయడం ద్వారా పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడటంలో ప్రభుత్వం, కోర్టులు కూడా విఫలమయ్యాయనే సంకేతాలు దేశమంతటా వెలువడతాయని సూచించారు. వారిపై ఉన్న తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఫోరం డిమాండ్ చేసింది. ఈ పిటిషన్‌పై సంతకాలు చేసిన వారిలో ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ, రమణి, రాయలసీమ స్టడీ సెంటర్ అధ్యక్షుడు భూమన్, డాక్టర్ గోపినాథ్, ఆవాలత, ప్రభాకర్ కుందుర్తి, వెంకట్ రెడ్డి, నల్లపు ప్రహ్లాద్, ఎస్ వెంకట్ రెడ్డి, మారంరాజు రమణ, అజయ్ కుమార్, సుధా గోపరాజు, సామ మల్లారెడ్డి, వి.సుబ్రమణ్యం, జయ వింధ్యాల, రాఘవేందర్ రెడ్డి, కవ్వ లక్ష్మారెడ్డి, ప్రఫెసర్ మహమూద్, గోలి ఏడుకొండలు, గొట్టెముక్కల భాస్కర్ తదితరులు ఉన్నారు.

Tags : illegal arrests, Prof., Anand Teltumbde, Gautam Navlakha, Human Rights


Next Story

Most Viewed