దుక్కి దున్నగలం.. కలుపు తీయగలం.. వంతెన నిర్మించగలం

by  |
bamboos-1
X

దిశ, పరిగి : రైతులు దుక్కి దున్నటం, కలుపు తీయటం వంటి పనులకు ఆటంకాలు ఎదురైతే ఎలాంటి ఆలోచన అయిన చేయగలమని మరోసారి నిరూపించుకున్నారు. ఏళ్ల తరబడి వాగులో మునుగుతూ, తేలుతూ పంటలు పండించిన రైతులు, తరువాత వంతెన నిర్మాణం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయిన ఫలితం లేకపోవటంతో ఇక లాభం లేదనుకుని తమ స్వహస్తాలతో ఏకంగా వంతెన కట్టారు.

100 మంది రైతులు చందాలు వేసుకుని, తమకున్న పరిజ్ఞానంతో వారం రోజుల్లో వంతెన పూర్తి చేసుకున్నారు. వివరాలు.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి గ్రామ రైతులను ప్రతి వర్షాకాలంలో వంతెన సమస్య శతాబ్దికాలం నుంచి పట్టి పీడిస్తోంది. చిగురాల్‌పల్లిలో పెద్దవాగు, చిన్నవాగు అనే రెండు వాగులపై నుంచి వెళ్లి నిత్యం వ్యవసాయం చేసుకునే రైతులు వందలాదిగా ఉంటారు. సుమారు 500 ఎకరాలకు పైగా సాగు భూములు ఈ వాగు దాటిన తరువాతనే ఉన్నాయి.

bamboos-2

దాంతో వాగులపై వంతెనలు నిర్మించండంటూ గ్రామసభలు, మండల సర్వసభ్య సమావేశాల్లో చర్చించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. వర్షాకాలంలో పొలాలకు వెళ్లలేక, పశుపక్షాదులను పశుగ్రాసం అందక దిక్కుతోచని స్థితిలో రైతులు కాలం గడిపారు. అధికారులు, పాలకులు పట్టించుకోలేక నానా తిప్పలు పడ్డారు. చివరకు తామే ఓ వంతెన కడితే ఎలా ఉంటుందంటూ ఆలోచించి ముందడుగు వేశారు.

లక్షకు పైగా చందాలు.. వందమంది రైతులు.. రెండు టీమ్‌లు

వాగు దాటి వ్యవసాయానికి వెళ్లే రైతులంతా చందాలు వేసుకొని లక్షకు పైగా జమ చేసుకున్నారు. వర్షాకాలం ఆరంభానికి ముందే వాగుకు అడ్డంగా జేసీబీతో ఇనుప రాడ్‌లు, సిమెంట్ పోలులను పాతారు. అనంతరం పొడుగాటి వెదురు కట్టెలను అడ్డంగా కట్టారు.

bamboos-3

ఆపై వెదురు పట్టపై చిన్నపాటి వెదురు కట్టెలను కొబ్బరి తాడుతో గట్టిగా కట్టి వెదురు వంతెనను ఏర్పాటు చేసుకున్నారు. దీని నిర్మాణం కోసం వందమంది రైతులు రెండు షిప్టులుగా శ్రమించి, నడిచి వెళ్లేందుకు వీలుగా వంతెనలను ఏర్పాటు చేసుకున్నారు. గత రెండేళ్లుగా రెండు సార్లు వంతెనలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గతేడాది వచ్చిన వరదకు వంతెన పాడవటంతో, ఈ సారి మరింత పటిష్టంగా వంతెనను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.

మా గోడు ఎవరు పట్టించుకోలేదు : దోరటి వెంటకయ్య

మా తాతల కాలం నుంచి ఈ వాగు సమస్య పట్టి పీడిస్తోంది. అధికారులకు, పాలకులకు వినతులు, వేడుకోలు చేసి అలసిపోయాం. రైతులమంతా చందాలు వేసుకొని వారం రోజులు కష్టపడ్డాం. రెండు వాగులపై వెదురు కట్టెలతో వంతెన ఏర్పాటు చేసుకున్నాం. కేవలం రైతుల వెళ్లేందుకు మాత్రమే ఉపయోగకరంగా ఉంది. పశుపక్షాదులు వెళ్లడం కుదరదు. అధికారులు స్పందించి వంతెన ఏర్పాటు చేయాలి.


Next Story

Most Viewed