దౌర్జన్యంగా లక్కోవాలని చూస్తే.. వారికి అండగా ఎర్రజెండా : బాబూరావు

by  |
Former MP Medium Baburao
X

దిశ, భద్రాచలం: ఆదివాసీలకు అన్యాయం చేయొద్దని సీపీఎం నేత, మాజీ ఎంపీ మిడియం బాబూరావు అధికారులకు కోరారు. భూమిని కాపాడుకునేందుకు ఆదివాసీలు చేపట్టిన దీక్షను శుక్రవారం మిడియం బాబూరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చర్ల మండల కేంద్రంలోని రైస్‌పేట కాలనీ సర్వే నెంబర్ 53లో అసైన్‌మెంట్ పట్టాలు పొందిన 28 మంది నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని అన్నారు. 2007లో పట్టాలు పొందిన విజయకాలనీ ఆదివాసీలు ఆ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారికి రైతుబంధు కూడా వస్తోందని గుర్తుచేశారు. ఇవేవీ పట్టించుకోకుండా సర్వే నంబర్ సరికాదనే నెపంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని ఏకలవ్య పాఠశాల భవనానికి కేటాయించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పేద ఆదివాసీ కుటుంబాల పొట్టకొట్టడమే అన్నారు.

దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఒకవేళ ఈ భూమి ఏకలవ్య పాఠశాలకు అనుకూలమని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తే అసైన్‌మెంట్ చట్టప్రకారం ఈ భూమికి బదులు తమకు మరోచోట భూమి కేటాయించినా అభ్యంతరం లేదని చెబుతున్నారు. ఆ దిశగా అధికారుల చర్యలు చేపట్టాలని సూచించారు. దౌర్జన్యంగా భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే గిరిజన సంఘం, సీపీఎం పార్టీ ఆదివాసీలకు అండగా నిలుస్తుందని హెచ్చరించారు. పట్టాలున్నా ఆదివాసీల గోడు అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. ఆదివాసీల పట్ల కక్షపూరిత వైఖరి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మిడియం బాబూరావు వెంట సీపీఎం చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్, మండల కమిటీ సభ్యులు బోళ్ళ వినోద్, వ్యకాస నాయకురాలు పొడుపుగంటి సమ్మక్క, కేవీపీఎస్ నాయకులు మచ్చా రామారావు, బందెల చంటి, బాధిత రైతులు వరలక్ష్మి, కూసుమంచి వెంకటేశ్వరరావు, పలక సూరమ్మ, గీత తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed