Breaking: టీఆర్ఎస్ సర్కార్‌పై గుమ్మడి నర్సయ్య సీరియస్

by  |
Former MLA Gummadi Narsaiah
X

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎమ్ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్దనున్న ధర్నా చౌక్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన వరి దీక్షలో గుమ్మడి నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టిచుకోవడం లేదని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా రాష్ట్రంలో పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం సేకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కొనకపోతే, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనకూడదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద లేదా అని అడిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే బతుకులు బాగుపడుతాయని ఆశించిన వారిని రోడ్డుమీదకు నెట్టేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ అంతు చూడటానికి రైతులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి పోరాటానికి న్యూ డెమోక్రసీ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.

అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఢిల్లీలోని రైతుల పోరాటానికి కేంద్రం తలొగ్గిందని, ఏనాడూ రైతుల పోరాటానికి కేసీఆర్ మద్దతు ప్రకటించలేదని, పోరాటంలో చనిపోయిన రైతులకు కనీసం అసెంబ్లీలో సంతాపం కూడా తెలుపలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆనందం కోసం కళ్లాల్లో రైతులను కన్నీరు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. మిల్లర్లను ప్రభుత్వం ఎందుకు మందలించడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై వరి వద్దంటున్నాయని అన్నారు. ప్రభుత్వం కరోనా చావులు, రైతుల చావుల లెక్కలు దాచి పెడుతోందని తెలిపారు. ఓవైసీ, మోడీ వేరు వేరు కాదని, మోడీ వ్యతిరేక ఓట్లను ఓవైసీ చీల్చి బీజేపీకి పరోక్షంగా సహాయం చేస్తోందని అన్నారు. రైతుల కోసం ఎంతటి త్యాగానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధం అని ప్రకటించారు.

అనంతరం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. చేనుకు చీడ పడితే ఏం చేయాలో రైతుకు తెలుసని, కానీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆరే రైతుకు పట్టిన పెద్ద చీడగా మారాడని, కళ్లాల్లో రైతులకు ఎలాంటి వసతులు లేవని అన్నారు. ఇసుక లారీలను పదిరోజులుగా ఆపితే వరి ధాన్యం ట్రాన్స్ పోర్ట్ చేయొచ్చని సూచించారు. ఢిల్లీకి వెళ్లి తేల్చుకొని వస్తా అన్న కేసీఆర్, ఢిల్లీకి వెళ్లొచ్చి ఫామ్ హౌజ్‌కే పరిమితం అయ్యాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఏం జరిగిందో, వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఏం పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఉందని, కేసీఆర్ రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. వర్షాకాలం పంట, యాసంగి పంట రెండు కొనాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగం కోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతామని ప్రకటించారు.

Next Story

Most Viewed