రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మంత్రికి మాజీ ఎమ్మెల్యే సవాల్

by  |
రాజకీయాల నుంచి తప్పుకుంటా..  మంత్రికి మాజీ ఎమ్మెల్యే సవాల్
X

దిశ, ఏపీ బ్యూరో: పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ తనదేనని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు…ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లకు సవాల్ విసిరారు. గత కొన్ని రోజులుగా పులిచింతల ప్రాజెక్టు తానే కట్టానని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగి పోవడానికి కారణం తానేనని ఓ మీడియా సంస్థ తనపై విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

2017 నుంచి తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 2004లో వైఎస్ఆర్ హయాంలో ప్రాజెక్టు ప్రారంభమైతే తనకెలా కాంట్రాక్టు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. తనకు సంబంధం లేని విషయంపై పదేపదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైసీపీ అనుకూల పత్రికలో తాను రూ.280 కోట్ల అవినీతి చేశానని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఇసుక ఎక్కడ దొరుకుతుందో మీరే చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇసుక లేని చోట రూ.150 కోట్ల అవినీతి ఎలా చేస్తానని బోలినేని రామారావు ప్రశ్నించారు.

పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులేనని..వారు ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ విషయం తెలుసుకుని మంత్రి అనిల్, సజ్జలలు మాట్లాడాలని సూచించారు. తన కంపెనీ పేరు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ అని తాను ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయలేదన్నారు. పక్క రాష్ట్రంలో పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేసిన మీడియా తక్షణమే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో లీగల్‌గా పరువునష్టం దావా వేస్తానని మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు హెచ్చరించారు.

Next Story

Most Viewed