కబడ్డీ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచిన మాజీ మంత్రి

by  |
tummala1
X

దిశ, పాలేరు: గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ప్రతి విషయంలో ముందడుగు వేయాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కొన్ని టీమ్స్ తో కబడ్డీ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో గ్రౌండ్ లో సందడి వాతావరణం చోటుచేసుకుంది. స్వతహాగా తుమ్మల కబడ్డీ ఆటగాడు కావడంతో కబడ్డీ ఆడి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. మరుగున పడుతున్న క్రీడలను ప్రోత్సహిస్తున్న గ్రామస్తులను అభినందించారు. గ్రామ సర్పంచ్ దండా పుల్లయ్యను ప్రత్యేకంగా అభినందించారు. పాలేరు నియోజకవర్గం రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ఆటలో అనేక మార్పులు వచ్చాయని, ఇది గ్రామీణ క్రీడ అని, గతంలో కబడ్డీకి క్రేజ్ ఉండేదని, కబడ్డీ ఆటను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి, నెల్లూరి భద్రయ్య, వెన్నపూసల సీతారాములు, సుధాకర్ రెడ్డి, రమేష్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed