అది అమలు కాకపోతే ఆత్మార్పణ చేసుకుంటా.. మోత్కుపల్లి సంచలన ప్రటకన

by  |
Former minister Motkupalli Narsimhulu
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళితబంధు’ పథకంపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ‘దళితబంధు’పై ప్రతిపక్షాలు చేస్తోన్న కుట్రలకు వ్యతిరేకంగా ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళిత బంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆత్మబంధువని, ఈ పథకాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని అన్నారు. తాను 30 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఇన్నేండ్ల కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్‌లా దళితుల అభివృద్ధి కోసం కృషిచేయలేదన్నారు. దళితుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు.

ఎవరు మంచిపని చేసినా ఆహ్వానించాల్సిందేనని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఎందుకు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో ‘దళితబంధు’ అమలు కాకపోతే.. యాదగిరిగుట్ట వద్ద ఆత్మార్పణ చేసుకుంటా అని సంచలన ప్రకటన చేశారు. గతంలో కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ కోరారు. అంతేగాకుండా.. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డిది శనిపాదం అని మోత్కుపల్లి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో టీడీపీని సర్వనాశనం చేసినట్లే కాంగ్రెస్‌ను చేస్తాడని, రేవంత్ జీవితం మొత్తం మోసపూరితమే అని మండిపడ్డారు. కోట్లు ఖర్చుచేసి టీపీసీసీ పదవి కొనుక్కున్నారని, దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్‌రెడ్డికి లేదన్నారు. బండి సంజయ్‌ పాదయాత్ర ఎవరికోసం చేస్తున్నాడని, ఆయన పాదయాత్రతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. ముందు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని సూచించారు.


Next Story

Most Viewed