పార్టీ మార్పుపై మనసులో మాట బయటపెట్టిన ఎమ్మెల్యే గంటా

by  |
పార్టీ మార్పుపై మనసులో మాట బయటపెట్టిన ఎమ్మెల్యే గంటా
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. 2019 నుండి ఇప్పటి వరకు సుమారు వందసార్లు తాను పార్టీలు మారుతానని పుకార్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ మారే ఆలోచన ఉంటే అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. రహస్యంగా పార్టీ మారనని..ప్రజలకు చెప్పే వెళ్తానని క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలో చేరతానంటూ ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చారు. ఆయన ఏ లక్ష్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారో తనకే అర్థం కావడం లేదన్నారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మైండ్ గేమ్ ఆడేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఎటువంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయి రెడ్డే సమాధానం చెప్పాలని గంటా నిలదీశారు. ఇకపోతే తన ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలో చేరడంపైనా స్పందించారు. కాశీ గత రెండేళ్లుగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని చెప్పుకొచ్చారు. పార్టీ మారాలంటూ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కాశీ తనతో చెప్పినట్లు గంటా స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని తాను సలహా ఇచ్చానని గంటా శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed