మంత్రి కేటీఆర్ పై ‘సర్దార్’ సంచలన కామెంట్స్.. మున్సిపల్ మంత్రిగా పనికిరారట..!

by  |
మంత్రి కేటీఆర్ పై ‘సర్దార్’ సంచలన కామెంట్స్.. మున్సిపల్ మంత్రిగా పనికిరారట..!
X

దిశ, సిరిసిల్ల : ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ పై కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల మునిగిపోతుంటే మంత్రిగా కేటీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఐటీ మంత్రిగానే పనిచేస్తారు తప్పా మున్సిపల్ మంత్రిగా పనికిరారంటూ దుయ్యబట్టారు. 500 సెక్షన్లు ఉన్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లకు తగ్గించి, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చారని రవీందర్ సింగ్ మండిపడ్డారు. దళితులపై సిరిసిల్లలో దాడులు జరిగాయని, క్యాంపు రాజకీయాలతో ఎమ్మెల్సీలను గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు ఆరుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు జెడ్పీ ఛైర్ పర్సన్లను క్యాంపులో ఓటర్లకు కాపలాగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. మీ నాయకులపై మీకు నమ్మకం లేకనే కాపలా ఉంచారా? అని అడిగారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో 12 మంది గెలిచారన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రెబల్ అభ్యర్థులు ఆయన ఇలాఖాలో గెల్చిన విషయంపై స్థానిక ఎమ్మెల్యేగా కేటీఆర్ ఏం సమాధానం చెబుతారో చెప్పాలని రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు.

ఓట్లపై తప్ప టీఆర్ఎస్‌కు వేరే ధ్యాసే లేకుండా పోయిందని విమర్శించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుంటే పట్టించుకునే వారే లేకుండా పోయారన్నారు. భానుప్రసాద్ రావును ఎందుకు గెలిపించాలో చెప్పాలని, ఎప్పుడూ ఆయన ఈ జిల్లాకు రాలేదన్నారు. శాసనమండలిలో మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాల సందర్భంగా భానుప్రసాద్ ఎందుకు మాట్లాడలేదని, ఏ సమస్యనూ పట్టించుకోని ఆయనకు ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలని కోరారు. డబ్బులిచ్చి ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుద్దామనుకున్నప్పటికీ తాను నామినేషన్ వేయడం వల్లే ఏకగ్రీవం కాలేదన్నారు. క్యాంపుల్లో ఇస్తున్న డబ్బులు మీవేనన్నారు. తాను బరిలో నిలబడడం వల్లే ప్రజాప్రతినిధులకు గౌరవం దొరుకుతోందని, వేతనాలు కూడా మంజూరు అయ్యాయని రవీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు జాతీయ జెండా ఎగురవేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవం కోసమే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, స్థానిక ప్రజాప్రతినిధుల గొంతుకగా మారి సమస్యలపై శాసనమండలిలో మాట్లాడుతానని స్పష్టం చేశారు.

న్యాయవాదిగా మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్నదని, మొదటి ప్రాధాన్య ఓటు తనకే వేసి గెలిపించాలని కోరారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, సీక్రెట్ ఓటింగ్ విధానం వల్ల మీరు ఎవరికి ఓటు వేస్తున్నారనేది బయటకు తెలిసే అవకాశమే లేదని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఎన్ని డబ్బులు పంచినా టీఆర్ఎస్ ఓడిపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ ఫలితం రిపీట్ కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఉద్యమకారులు లేనట్టు భానుప్రసాద్, ఎల్.రమణలకు టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యమకారులపై రాళ్లు విసిరిన కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిన 18 గంటల్లోనే ఎమ్మెల్సీ ఇచ్చారని, ఉద్యమకారులకు అండగా ఉండాల్సిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టించుకోకపోవడం లేదన్నారు. కేసీఆర్‌ను నానా మాటాలు అన్న తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్లకు మంత్రి పదవులిచ్చారని, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లే కేబినెట్‌లో మంత్రులుగా వ్యవహరిస్తున్నారని రవీందర్ సింగ్ ఆరోపించారు.

MLC ఎన్నికల కోసం భారీ‌స్కెచ్.. ఈటల రాజేందర్ దెబ్బ.. టీఆర్ఎస్ అబ్బా..!



Next Story