‘మాట్లాడుకుందాం పక్కకు రా’ అని.. గొర్రెల కాపరిని చితకబాదిన ఫారెస్ట్ అధికారులు!

by  |
‘మాట్లాడుకుందాం పక్కకు రా’ అని.. గొర్రెల కాపరిని చితకబాదిన ఫారెస్ట్ అధికారులు!
X

దిశ, అచ్చంపేట : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం వంగురోని పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నరియాల నరేష్ యాదవ్‌ను అటవీశాఖ అధికారులు మంగళవారం సాయంత్రం చితకబాదారు. బాధితుడు, బంధువులు కథనం ప్రకారం.. అమ్రాబాద్ పదర మండలాల్లోని యాదవులు సమీప అటవీ ప్రాంతంలోకి గొర్రెలను పశుగ్రాసం కోసం తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలోనే నరేష్ కూడా గొర్రెలను తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్లాడు.

మాట్లాడుకుందాం పక్కకు రా…

గొర్రెల మంద వద్దకు వచ్చిన నలుగురు అటవీశాఖ అధికారులు నరేష్ యాదవ్‌ను మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లి చితకబాదారు. కర్రలతో తీవ్రంగా కొట్టడం వలన కాలు పిక్క భాగం చిట్లిపోయి రక్తస్రావం అయ్యింది. నరేష్‌ను అధికారులు తీసుకెళ్ళడాన్ని గమనించిన మిగిలిన గొర్రెల కాపరులు.. వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఏం జరిగిందో చూసొద్దామని అధికారుల వద్దకు వెళ్లే సరికి నరేష్‌ను చితకబాదడాన్ని తోటి గొర్రెల కాపరులు చూశారు. గొర్రెలను అడవిలోకి తీసుకురావొద్దని మాటలతో చెప్పకుండా ఇలా కర్రలతో దాడిచేయడం ఎంతవరకు సరైనదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

రేపు అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన..

స్థానికంగా ఉన్న గొర్రెల కాపరులు పశుగ్రాసం కోసం అడవిలోకి రావొచ్చని.. గ్రాసం కూడా తీసుకెళ్లొచ్చని.. కానీ స్థానికేతర గొర్రెల కాపరులు ఈ ప్రాంతానికి రావొద్దని ఇటీవల అటవిశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. కానీ, గొర్రెల పెంపకంతోనే మనుగడ సాగిస్తున్నా స్థానిక యాదవులపై అటవీశాఖ అధికారులు భౌతిక దాడులు చేయడాన్ని యాదవ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అటవీశాఖ అధికారులు నరేష్ పై కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసినందుకు నిరసనగా బుధవారం అటవీ శాఖ కార్యాలయం ఎదుట పెద్ద మొత్తంలో యాదవులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.


Next Story