కామారెడ్డిలో దారుణం.. రైతుపై ఫారెస్ట్ ఆఫీసర్ దాడి

by  |
Forest Officer
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అటవీ శివారు ప్రాంతం, పట్టా భూమిలో సాగు చేస్తున్న పంటను ధ్వంసం చేయడమే కాకుండా రైతుపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ దాడి చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గాలిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… గాలిపూర్ గ్రామానికి చెందిన రైతు బాలరాజు గౌడ్‌కు గిర్నితండా గ్రామ పంచాయితీలోని శివారు అటవీ ప్రాంతంలో కొంత పట్టా భూమి ఉంది. అందులో పంట సాగుచేశారు. సోమవారం పొలం వద్దకు వచ్చిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముంతాజ్ మొత్తం పంటను ధ్వంసం చేసి, రైతు బాలరాజును కర్రతో విచక్షణారహితంగా చితక్కొట్టాడు.

కాగా, వివాదంలో ఉన్న సదరు భూమి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, చెప్పినా వినకుండా ఫారెస్ట్ ఆఫీసర్ పలుమార్లు తమపై దాడికి పాల్పడుతున్నాడని బాలరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫారెస్ట్ ఆఫీసర్ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాలరాజును కుటుంబసభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం అక్రమాలకు పాల్పుడుతున్నా పట్టించుకోకుండా.. రైతుపై ఫారెస్ట్ అధికారి దాడికి పాల్పడటంతో పలువురు విమర్శలు చేస్తున్నారు. బాలరాజు కుటుంబ సభ్యులు నిజాం సాగర్ పోలీస్ స్టేషన్‌లో అటవీ శాఖాధికారుల దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు.


Next Story

Most Viewed