ఫారెస్ట్ భూముల్లో అధికారుల అక్రమాలు..!

by  |
ఫారెస్ట్ భూముల్లో అధికారుల అక్రమాలు..!
X

దిశ, చిట్యాల: ఫారెస్ట్ భూములను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. వందల ఎకరాల భూములను కొందరు బడా బాబులకు సాగు చేసుకొమ్మని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారు. ఈ వ్యవహారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

చిట్యాల మండలం వెంచరామి గ్రామ శివారులోని సర్వే నంబర్ 115లో 1406.26 గుంటలు,122 సర్వే నంబర్ లో 5912.13 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అది ఫారెస్ట్ స్థలమా, ప్రభుత్వ స్థలమా అనేది మాత్రంనిగ్గు తేలలేదు. ఈ నేపథ్యంలోనే సర్వే నిర్వహించిన అధికారులు115 సర్వే నంబర్‌‌లో 1,023 ఎకరాలు,122 సర్వే నంబర్‌లో 786 ఎకరాల భూమిని అసైన్డ్ ల్యాండ్‌గా గుర్తించారు. మిగతా భూమిని ఫారెస్టు భూములుగా పరిగణించారు.

ఇది ఇలా ఉంటే అసైన్డ్ భూముల పక్కనే వందల ఎకరాలకు పైగా ఫారెస్ట్ భూములు ఉండడంతో కొంతమంది బడాబాబులు అటవీ శాఖ అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా సాగు చేసుకుంటున్నారు. వీటిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులే డబ్బులు దండుకుని వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఓ వ్యక్తి వందల ఎకరాలకు పైగా భూములను ఫారెస్ట్ అధికారులు సాగు చేసుకోమని చెబుతున్నారని కలెక్టర్, భూపాలపల్లి రేంజ్ ఆఫీస్‌కు సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు. అందులో ప్రభుత్వ, ఫారెస్ట్ భూమిని బీట్ ఆఫీసర్లు విజయ కృష్ణ ప్రజల వద్ద అమ్మకానికి పెట్టి అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొనడం గమనార్హం. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

చర్యలు శూన్యం, పట్టించుకోని అధికారులు..

ఫారెస్ట్ భూములను రక్షించాల్సిన బాధ్యత పూర్తిగా ఫారెస్ట్ అధికారుల పైనే ఉంటుంది. ఆ భూములకు రక్షణ‌గా చుట్టూ ఫెన్సింగ్ వేయించి కాపాడాలని నిబంధనలు ఉన్నాయి. కానీ దీనికి భిన్నంగా ఆ భూములకు ఎలాంటి రక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సాగు చేసుకుంటున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు డబ్బులు తీసుకొని సాగు చేసుకోమని చెబుతున్నారని విమర్శలు ఉన్నాయి. వీటిపై పర్యవేక్షించాల్సిన జిల్లాస్థాయి అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాం..

సోషల్ మీడియాలో ఓ వ్యక్తి డబ్బులు తీసుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. భూములు ఆక్రమణకు గురైన విషయం తమకు తెలియదని చెప్పాను. ఇప్పటి వరకు మేము ఎవరిని సాగు చేసుకోమని చెప్పలేదు. 2013 సంవత్సరంలో ఈ భూములపై గొడవలు జరిగాయి అప్పుడు నేను లేను. తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని గుర్తించడానికి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాను. -బీట్ ఆఫీసర్ విజయ

Next Story

Most Viewed