పువ్వులు వికసించె.. పూజల్లేక విలపించే!

by  |
పువ్వులు వికసించె.. పూజల్లేక విలపించే!
X

దిశ, కరీంనగర్: సాధారణంగా పూజకు పనికి రాని పూలని కొన్నింటిని అర్చకులు, భక్తులు పక్కకు పెడుతుంటారు. కానీ, ఇప్పుడు పూజకు ఉపయుక్తమైన పూలూ వినియోగం లేక పనికి రానివిగా మారిపోతున్నాయి. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి వ్యాప్తి కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ఆలయాలన్నీ మూతపడ్డాయి. కేవలం అర్చకులు మాత్రమే రోజువారీ పూజలు చేస్తున్నారు. భక్తులను అనుమతించడం లేదు. దీంతో ప్రముఖ ఆలయాల్లో భక్తుల సందడి లేదు. పుణ్య‌క్షేత్రమైన కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి ఆలయానికీ భక్తుల రాకపోకలు లేవు. త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకునేవారు. కానీ, ఇప్పుడు గోదావరి నదిలో పూజలు, పుణ్యస్నానాలు లేవు. వికసించన పూలు తెచ్చి నదికి పూజలు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం పూలపై ఆధారపడిన వారూ ఉపాధి కోల్పోయారు.

చెరువులోనే పూలు..

భక్తులు గోదావరి నదికి పూజలు చేసేందుకు ఆలయం వెనక భాగంలో ఉన్న గుండం చెరువు పూలను ఉపయోగిస్తారు. ఈ పూలతో గోదావరి మాతకు, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో పూజలు చేస్తారు. కాని లాక్ డౌన్‌తో పూలు చెరువులోనే ఉండిపోయాయి. సాధారణంగా గోదావరి తీరంలో ఉండే మహిళలు పూలను చెరువు నుంచి సేకరించి అమ్మేవారు. వేకువ జామునే సేకరించిన పూలను ఆయా ప్రాంతాల్లో అమ్ముకునేవారు. కానీ, భక్తులు రాలేని పరిస్థితి తయారు కావడంతో పూల సేకరణ ఆగిపోయింది. దీంతో అటు వారు ఉపాధి కోల్పోగా ఇటు పూలూ అలానే ఉండి పోతున్నాయి. అయితే, పూలు కోయకుండా అలానే వదిలివేస్తుండటంతో గుండం చెరువు సరికొత్త శోభ సంతరించుకుంది. చెరువు శిఖం ప్రాంతమంతా పూల వనంగా మారిపోయి చూపరులను ఆకర్షిస్తోంది. నేచురాలిటీని పంచుతోంది.

Tags: no adoration, covid 19 affect, lockdown, flowers, crying, temples closed



Next Story

Most Viewed