క్లియర్‌ట్రిప్‌ను సొంతం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్!

by  |
క్లియర్‌ట్రిప్‌ను సొంతం చేసుకున్న ఫ్లిప్‌కార్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఆన్‌లైన్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా కీలక ప్రకటన వెల్లడించింది. భారత్‌లో కొన్నేళ్లుగా కార్యకాలాపాలను నిర్వహిస్తున్న ట్రావెల్ బుకింగ్ పోర్టల్ క్లియర్‌ట్రిప్‌లో 100 శాతం వాటాను సొంత చేసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సంస్థను పటిష్టం చేయడమే కాకుండా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా క్లియర్‌ట్రిప్ నిర్వహణ వ్యవహారాలను ఫ్లిప్‌కార్ట్ సొంతమైనప్పటికీ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగుతుందని, ఉద్యోగులు యథాతథంగా కొనసాగుతారని, కంపెనీ అభివృద్ధి కోసం పనిచేస్తుందని పేర్కొంది. ఒప్పందం విషయం ఖరారు చేసినప్పటికీ, కొనుగోలు ఎంత మొత్తానికి జరిగిందనే విషయంపై ఫ్లిప్‌కార్ట్ స్పష్టత ఇవ్వలేదు. మార్కెట్ వర్గాల ప్రకారం ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 300 కోట్లు ఉండొచ్చని అంచనా.

‘డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై వినియోగదారులకు అవసరమైన విస్తృత సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని, కొత్త రంగాలకు విస్తరించడం ద్వారా ఇది సాధించగలమని’ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. పర్యాటక రంగంలో, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా క్లియర్‌ట్రిప్‌కు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాగా, 2006లో హర్ష్ భట్, మాథ్యూ స్పేసీ, స్టువర్ట్ క్లియర్‌ట్రిప్‌ను స్థాపించారు. హోటళ్లు, ఎయిర్ ట్రావెల్ బుకింగ్ మార్కెట్లో దశాబ్ద కాలంగా మేక్ మై ట్రిప్, గో ఐబీబో లాంటి బడా కంపెనీలతో పోటీ పడుతోంది.


Next Story

Most Viewed