రాష్ట్రంలో మరో ఐదు పాజిటివ్ కేసులు

by  |
రాష్ట్రంలో మరో ఐదు పాజిటివ్ కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరో ఐదు వెలుగులోకి వచ్చాయి. శనివారం రాత్రి నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21 కాగా ఆదివారం కొత్తగా ఐదు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరుకుంది. ఇందులో ఇద్దరు లండన్ నుంచి వచ్చిన ప్రయాణీకులు కాగా మరో ఇద్దరు దుబాయ్ నుంచి వచ్చినవారని, ఒకరు స్కాట్‌లాండ్ నుంచి వచ్చినవారు. రాష్ట్రంలో కేవలం ఒక్క కేసు మినహా మిగిలిన పాతిక కేసులూ విదేశీ ప్రయాణం ద్వారా వచ్చినవేనని ముఖ్యమంత్రి తెలిపారు. సికింద్రాబాద్‌లో నమోదైన ఒక్క కేసు మాత్రమే వారి తల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది తప్ప మిగిలినవన్నీ విదేశీ ప్రయాణం పుణ్యమేనని అన్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత విదేశీ విమానాలన్నీ నిలిచిపోతుండడంతో ఇకపైన కొత్తగా వచ్చే కేసులేమీ ఉండవని దీమా వ్యక్తం చేశారు.

విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చినవారు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఆ కారణంగానే ఆలస్యంగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాల్సిన వ్యక్తులు రోడ్లమీదకు రాకుండా జాగ్రత్త పడాలని, ఎవరైనా వస్తే ప్రజలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి రానీయకుండా స్వీయ నియంత్రణ పాటించాలని వారికి సీఎం విజ్ఞప్తి చేశారు. క్వారంటైన్‌లో ఉండడం ద్వారా వారికి, వారి కుటుంబాలకు, స్నేహితులకు, సన్నిహితులకు, బంధువులకు మాత్రమే కాక యావత్తు తెలంగాణ సమాజానికి, దేశానికి మంచిదని హితవు పలికారు.

కరోనా వ్యాధితో యావత్తు ప్రపంచం అతలాకుతలమవుతోందని, కళ్ళ ముందే ఇటలీ ఏమవుతూ ఉందో చూస్తున్నామని, తెలంగాణ సమాజానికి అది జరగరాదన్న ఉద్దేశంతోనే ఇండ్లకు మాత్రమే పరిమితం కావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇది చాలా దుఃఖ సమయమని, పరిస్థితిని ఆషామాషీగా తీసుకోవద్దని, భవిష్యత్ తరాలను కాపాడాలన్న సామాజిక బాధ్యతతో మెలగాలని కోరారు. ఇప్పటికీ విదేశీ ప్రయాణం చేసివచ్చినవారి వివరాలను తెలుసుకోడానికి సుమారు ఆరు వేల ప్రభుత్వ సిబ్బంది బృందాలు తిరుగుతున్నాయని, దేశంలోనే మరే రాష్ట్రం లేనంత హైపరాక్టివ్‌గా తెలంగాణ పనిచేస్తోందన్నారు.

వైద్యసిబ్బంది కృషి ప్రశంసనీయం

కరోనా లక్షణాలతో ఉన్నవారికి వైద్య సేవలు అందించడంలో వైద్యులు, నర్సులు, మొత్తం వైద్య సిబ్బంది రేయింబవళ్ళు సేవలందిస్తున్నారని, వారి కృషి ప్రశంసనీయమన్నారు. ఈ పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తోందని, వారే సేవ చేయకుండా సమాజం ఇప్పుడు ఉన్నట్లుగా ఉండకపోయేదన్నారు. వారికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా, ఆ వ్యవస్థ యధావిధిగా పనిచేసేలా సహకరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. వారికి పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, దాని నుంచి ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతోనే అత్యవసరం కాని ఆపరేషన్లను వాయిదా వేయాల్సిందిగా విజ్ఞప్తి చేశామని కేసీఆర్ గుర్తుచేశారు.

Tags: Telangana, Corona, Positive Patients, 26, Quarantine

Next Story

Most Viewed