చర్లలో ఐదుగురు మిలీషియా సభ్యుల అరెస్టు..

by  |
చర్లలో ఐదుగురు మిలీషియా సభ్యుల అరెస్టు..
X

దిశ, భద్రాచలం : చర్ల పోలీసులు ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్‌పీ డాక్టర్ వినీత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, 141 బీఎన్ సీఆర్‌పీఎఫ్ పోలీసులు కలిసి శనివారం ఉదయం చర్ల మండలంలోని పూసుగుప్ప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా భద్రతా బలగాలను చూసి ఆరుగురు యువకులు పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అందులో ఒకరు 17 ఏళ్ళ బాలుడు ఉన్నాడు. మిగిలిన ఐదుగురు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఊసూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపురం గ్రామానికి చెందిన కుంజం అడమ (30), మడిబి జోగా (23), మడివి బండి (27), మడివి ఉంగా (23) మడకం సన్ను (25)గా గుర్తించారు.

గత మూడేళ్ళుగా మావోయిస్టు మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్న వీరు 2020 ఆగస్టులో కూంబింగ్ పోలీసులను హతమార్చడం కోసం 100 గుంటలు తీసి వాటిలో ఇనుప చువ్వలు గల చెక్కలు (బూబీ ట్రాప్స్) అమర్చినట్టు తెలిపారు. పోలీసులు వాటిని ముందుగానే గుర్తించి వెలికి తీయడంతో పెనుప్రమాదం తప్పింది. మిలీషియా సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం హాజరుపర్చినట్టు తెలిపారు. మైనర్ బాలుడిని కోర్టు ఆదేశాల మేరకు జ్యువెనల్ హోంకు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో చర్ల సీఐ బి.అశోక్, ఎస్ఐ రాజువర్మ, సీఆర్‌పీఎఫ్ అధికారి పాల్గొన్నారు‌.

Next Story