ఎయిర్ఇండియా కొనుగోలుకు బిడ్ దాఖలు చేసిన టాటాసన్స్!

by  |
Air India
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాను కొనేందుకు బుధవారం టాటాసన్స్ సహా వివిధ సంస్థలు ఆర్థిక బిడ్‌లను సమర్పించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎయిర్ఇండియా కొనుగోలుకు బుధవారమే తుది గడువు కావడంతో పలు సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని తెలుస్తోంది. ఆర్థిక బిడ్లను దాఖలు చేసిన కంపెనీల జాబితాలో టాటాసన్స్ కూడా ఉందని ఎయిర్ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

‘లావాదేవీ సలహాదారుల ద్వారా ఎయిర్ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆర్థిక బిడ్లను అందుకున్నాం. దీని తర్వాత తదుపరి ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుందని’ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) వెల్లడించింది. కాగా, ఎయిర్ఇండియా సంస్థ మొత్తం రూ. 43 వేల కోట్ల అప్పుల భారాన్ని మోస్తోంది. ఈ రుణాలకు సంబంధించి ప్రభుత్వ హామీ ఉండదు. కాబట్టి ఎయిర్ఇండియాను కొనుగోలు చేసే సంస్థ ఈ రుణాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను బహిర్గతం చేయలేదని తెలుస్తోంది.


Next Story