మంత్రి ఎర్రబెల్లికి షాక్ ఇచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు

by  |
warangal 1
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి నిర‌స‌న సెగ త‌లిగింది. శ‌నివారం ఉద‌యం హ‌న్మకొండ‌లోని మంత్రి త‌న క్యాంపు కార్యాల‌యం బ‌య‌ట‌కు వ‌స్తున్న క్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వ‌చ్చిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక్కసారిగా ఆందోళ‌న చేప‌ట్టారు. దాదాపు 50 మందికి పైగా ఉన్న ఆందోళ‌న‌కారులు మంత్రి కాన్వాయ్‌కు అడ్డం ప‌డుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ద‌యాక‌ర్‌రావుకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం త‌మ‌పై క‌క్షపూరితంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని, సంవ‌త్సర‌న్నర కాలంగా విధుల‌కు దూరంగా ఉంచుతూ మ‌మ్మల్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.ప‌నిలేక, జీతం రాక త‌మ కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయంటూ మ‌హిళా ఫీల్డ్ అసిస్టెంట్లు క‌న్నీరు పెట్టుకున్నారు. కుటుంబం గ‌డ‌వ‌కుండా క‌ష్టమ‌వుతోంద‌ని, పిల్లల‌కు స‌రైన తిండి పెట్టే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని విల‌పిస్తూ మీడియాకు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప బ‌హుమానం ఇచ్చారంటూ మండిప‌డ్డారు. ఇందుకేనా ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడి సాధించుకుందంటూనే దిక్కుమాలిన ప్రభుత్వం రాజ్యమేలుతోందంటూ శాప‌నార్థాలు పెట్టారు. నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు లాగేస్తున్నా.. కాన్వాయ్‌కు అడ్డం ప‌డుకున్నారు. దాదాపు అర్ధగంట‌సేపు మంత్రి కారులోనే కూర్చోవాల్సి వ‌చ్చింది. పోలీసులు బ‌ల‌వంతంగా నిర‌స‌న‌కారుల‌ను ఈడ్చేశారు. కొంత‌మందిని బ‌ల‌వంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు.


Next Story

Most Viewed