పండుగ సీజన్‌లో రూ. 57,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు

by  |
పండుగ సీజన్‌లో రూ. 57,000 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాది పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విలువ రికార్డు స్థాయిలో 7.6 బిలియన్ డాలర్ల(రూ. 57 వేల కోట్ల)కు చేరుకోవచ్చని అంచనా. ప్రముఖ పరిశోధనా సంస్థ కౌంటర్‌పాయింట్ ప్రకారం.. ఈ సారి పండుగ సీజన్‌లో మిడ్-రేంజ్, ప్రీమియం విభాగాల్లో స్మార్ట్‌ఫోన్‌ల కోసం వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోందని సంస్థ అభిప్రాయపడింది. ‘ దసరా, దీపావళి సమయంలో వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా కనిపిస్తోంది. మిడ్-రేంజ్, ప్రీమియం విభాగాల్లో ఎక్కువ డిమాండ్ కనిపిస్తుండటంతో ఈ పండుగ సీజన్ అమ్మకాలు మరింత వేగవంతంగా ఉండనున్నట్టు’ కౌంటర్‌పాయింట్‌కు చెందిన ప్రచిర్ సింగ్ అన్నారు.

స్మార్ట్‌ఫోన్ సగటు అమ్మకం ధరల (ఏఎస్‌‌పీ) పండుగ సీజన్ సమయంలో 14 శాతం వృద్ధితో 230 డాలర్ల(రూ. 17.200) కు చేరుకుంటుందని నివేదిక వివరించింది. ‘ వినియోగదారుల నుంచి మిడ్-రేంజ్ నుంచి ప్రీమియం(రూ. 15 వేల కంటే ఎక్కువ) విభాగంలోని స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ డిమాండ్ చూస్తున్నాం. దీనికి తోడు పండుగ సీజన్‌లో వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. గత రెండేళ్లుగా ప్రజలు పొదుపు ధోరణిని కలిగి ఉండటంతో స్మార్ట్‌ఫోన్‌లకు అమ్మకాలకు ఢోకా లేదని’ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ అన్నారు.


Next Story