సరస్సు సంరక్షణలో ధీరవనిత

by  |
సరస్సు సంరక్షణలో ధీరవనిత
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి కారణమైన మనిషి వల్ల జీవకోటి మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ మేరకు చాలామంది ప్రకృతి ప్రేమికులు తమ వంతుగా వనరులను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దుర్గాపూర్‌కు చెందిన సుమిత బెనర్జీ దశాబ్ద కాలంగా కోల్‌కతాలోని రెండో అతిపెద్ద నీటి వనరైన ‘రవీంద్ర సరోవర్’ రక్షించేందుకు తన వంతుగా ప్రయత్నిస్తోంది. పాలకులు, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో డంప్‌యార్డ్‌గా మారిన ఆ చెరువుకు పునర్ వైభవం తెచ్చేందుకు గ్రీన్ యాక్టివిస్ట్‌గా తన పోరాటం కొనసాగిస్తోంది.

ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఆమె రిటైర్డ్ కాగా,

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన సుమితా.. చదువు కోసం 1990లో కోల్‌కతాకు వెళ్లారు. బెంగాలీలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసి పాఠశాలలో టీచర్‌గా చేరింది. అయితే 2001 నుంచి తరచుగా రవీంద్ర సరోవర్‌కు వాకింగ్ వెళ్లే ఆమె, లేక్ లవర్స్ ఫోరం అనే మార్నింగ్ వాకర్స్ కమ్యూనిటీలో చేరింది. 192 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ సరోవర్ ప్రాంగణంలో 73 ఎకరాల్లో నీటిని నిల్వ చేస్తారు. అలాగే 11వేలకు పైగా చెట్లను కలిగి ఉండగా, నగర వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో ఈ సరోవర్ ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకే 1997లో ప్రభుత్వం ‘జాతీయ సరస్సు’గా ప్రకటించింది. అయితే జాతీయ సరస్సుగా ఉన్న రవీంద్ర సరోవరం కాలక్రమంలో ఓ డంప్‌యార్డ్‌గా మారిపోయింది. హాకర్స్ పేవ్‌మెంట్‌లను ఆక్రమించడం, వాకింగ్ టైల్స్ చెత్తతో నిండిపోవడం, బహిరంగ మలవిసర్జన చేసినా పట్టించుకునేవారే కరువయ్యారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పాలకులు, నాయకులు అందరూ దీనిపై నిర్లక్ష్యం వహించడంతో.. చలించిపోయిన సుమిత సరస్సును సంరక్షించేందుకు చర్యలు చేపట్టంది.

ఈ పచ్చని స్వర్గాన్ని సంరక్షించేందుకు ఉదయం నుంచి సరస్సు ప్రాంతంలో గస్తీ తిరుగుతూ, వ్యాపారులు, సందర్శకులు చెత్త వేయకుండా నిరోధించేది. మున్సిపల్ అధికారులతో మాట్లాడి చెత్త నిర్వహణ సక్రమంగా జరిగేలా కృషి చేసింది. అలాగే మేఘాలయ మాజీ గవర్నర్ తథాగత రాయ్ సలహా మేరకు మార్నింగ్ వాకర్స్ నుంచి వెయ్యికి పైగా సంతకాలు సేకరించి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 2014లో సరస్సు ప్రాంగణంలో వ్యాపారాలు నిర్వహించకూడదని హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. అంతటితో ఆగకుండా సరోవరంలో ఛత్‌పూజ నిర్వహించడంపై ప్రతికూల పర్యావరణ ప్రభావం ఉందని, దాన్ని నిలిపేసేందుకు మరొక పిటిషన్‌ వేయగా.. 2017న జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) సరస్సులో నిర్వహించే అన్ని సామాజిక, మతపరమైన పూజలను నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కానీ 2018-19లో భక్తులు రవీంద్ర సరోవర్ ద్వారాల తాళాలు పగలగొట్టి ఛత్ పూజ చేశారు. దాంతో దీపాల నూనె వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని కోర్టుకు లేఖ రాయడంతో సుప్రీం కోర్టు పూజలు ఆపేయమని తీర్పు ఇచ్చింది. అలాగే తన సొంత ఖర్చులతోనే న్యాయ పోరాటాలు చేస్తున్న సుమితా.. ఇరవై ఏళ్లుగా కార్పొరేట్ లాబీలు, రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థలకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడింది.

‘సరస్సు నగరంలో నడిబొడ్డున ఉంది. రాజకీయ నాయకుల నుంచి లాబీయిస్టుల వరకు ప్రతి ఒక్కరూ దానిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంటారు. ఇది ఒక జాతీయ సరస్సు దీన్ని రియల్ ఎస్టేట్ భూమిగా చూడటం చట్ట విరుద్ధం. కానీ కొంతమంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే కొందరు నాపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేస్తామని బెదిరించారు. ఇలా అనేకమంది చంపేస్తామంటూ బెదిరించినా సరస్సును కాపాడాటానికి నా జీవితం త్యాగం చేయాలనుకున్నాను. సరస్సులోని జీవవైవిధ్యం ప్రమాదంలో ఉన్నందున, పునరుజ్జీవనంలో నిపుణుల బృందం సేవలు అవసరం. ప్రభుత్వం సహకరిస్తే దీన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఈ ప్రియమైన సరస్సును నా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాను.
– సుమిత


Next Story

Most Viewed