గల్వాన్ జవాన్ల పరాక్రమాన్ని గుర్తుచేసిన ‘ఫౌజీ’

by  |
గల్వాన్ జవాన్ల పరాక్రమాన్ని గుర్తుచేసిన ‘ఫౌజీ’
X

దిశ, వెబ్‌డెస్క్ : చైనాకు చెందిన పబ్జీ గేమ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, గేమింగ్ ప్రియులను ‘పబ్జీ’ తరహాలో ఆకట్టుకునే విధంగా బెంగళూరుకు చెందిన భారతీయ సంస్థ ఎన్ కోర్ గేమ్స్ (nCore Games) త్వరలో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీనికి ‘ఫౌజీ’ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌-గార్డ్స్‌) అని పేరుపెట్టారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా.. ఫౌజీ గేమ్ టీజర్ విడుదల కాగా.. ఈ గేమ్ కేవలం వినోదం కోసమే కాకుండా, భారతీయ జవాన్ల త్యాగాలను ప్రతిబింబించేలా ఉందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

గత జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మొదటి ఘర్షణ జరగగా, ఇందులో దాదాపు 20 మంది భారత సైనికులు మరణించిన విషయం తెలిసిందే. అప్పటి ఘర్షణకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఫౌజీలో ఉండగా.. ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందనే అంశాన్ని విజువల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. భారత జవాన్ల ధైర్యసాహసాలను ప్రతిబింబించేలా టీజర్ ఉంది. ‘మేము ధైర్యవంతులం.. ఎందుకంటే మేము భయపడం. మేము గెలుస్తాం.. ఎందుకంటే మేము ఐకమత్యంగా ఉంటాం. మేము రక్షిస్తాం.. ఎందుకంటే మా కర్తవ్యాన్ని ప్రేమిస్తాం. మేమంతా కలిసి భారతమాతకు రక్షణగా ఉంటాం.. మేమే ఫౌజీ’ అంటూ ఫౌజీ టీం అందించిన టీజర్ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌ను గమనిస్తే.. పబ్జీ రేంజ్‌లోనే గేమ్ ఉంది. షూటర్ గేమ్‌గా వస్తున్న ఫౌజీలో పబ్జీలానే వివిధ లెవెల్స్ ఉన్నాయి.

బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న ఫౌజీ గేమ్‌.. మరికొన్ని వారాల్లో ఫౌజీ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం ‘భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌’కు అందజేయనున్నామని గతంలో అక్షయ్ కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఫౌజీ టీజర్‌ను దసరా సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో అక్షయ్ షేర్ చేస్తూ.. ‘ఈరోజు మనం చెడుపై మంచి గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భయంలేని, ఐక్యతా గార్డులు ఫౌజీ గురించి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకు మించిన మంచి రోజు ఏముంటుంది. దసరా రోజు ఫౌజీ టీజర్‌ను ప్రజెంట్ చేస్తున్నాం’ అని తెలిపాడు.


Next Story

Most Viewed