ఆగ్రహించిన అన్నదాతలు.. ధాన్యాన్ని తగులబెట్టి నిరసన

by  |
Farmers protest
X

దిశ, మల్హర్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు ధాన్యాన్ని తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని కొండపేట ఐకేపీ సెంటర్ వద్ద రోడ్డుపై రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా అధికారులు, నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

అయితే, ఈ కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా కొనుగోలు ఆలస్యం అవుతోందని రైతులు వాపోయారు. రేపు, మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు ఆందోళన చేస్తోన్న విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీసుల హామీతో రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కుమారస్వామి, సీపీఎం కాటారం మండల కార్యదర్శి కిషోర్, యూఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అక్కల బాపుతో పాటు రైతులు, తదితరులులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed