ఎరుపెక్కిన బెజవాడ..

by  |
ఎరుపెక్కిన బెజవాడ..
X

దిశ, ఏపీబ్యూరో : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే దాకా పోరు తప్పదని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా సోమవారం విజయవాడలో ఏపీ రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ భారీ ట్రాక్టర్​ర్యాలీ నిర్వహించింది. వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు ప్రదర్శనలో పాల్గొన్నారు. వివిధ రంగాల కార్మికులు సైతం మద్దతు తెలియజేస్తూ ర్యాలీలో ముందు పీఠిన నిలిచారు. ఇది కేవలం రైతుల ఆత్మ గౌరవ పోరాటమే కాదు. సగటు ప్రజల ఆహార భద్రతను దెబ్బతీసే చట్టాలని నాయకులు ఉద్ఘాటించారు. దాదాపు 40 రోజులుగా ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల పట్ల కేంద్ర సర్కారు వైఖరిని తప్పుబట్టారు. వాళ్ల పట్టుదలకు జేజేలు పలికారు. ఇది మరో స్వతంత్ర పోరాటంగా అభివర్ణించారు.

కార్పొరేట్​శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరుగా పేర్కొన్నారు. భవిష్యత్​తరాలను అంధకారంలోకి నెట్టే దుర్మార్గ నల్లచట్టాలను రద్దు చేసేదాకా ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా కేంద్రంలోని మోడీ సర్కారు దాదాపు 50 మంది రైతుల ఉసురు పోసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా మైనస్​డిగ్రీల చలిలోనూ పోరాడుతున్న రైతన్నలకు అన్ని విధాలా అండదండలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వినర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు రావుల వెంకయ్య, వై.కేశవరావు, వి. శ్రీనివాసరావు, సింహాద్రి ఝాన్సీ, డి హరినాథ్, మర్రాపు సూర్యనారాయణ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కొల్లా రాజమోహన్, జెట్టి గురునాధరావు, వి.వెంకటేశ్వర్లు, దడాల సుబ్బారావు, ఎమ్. ఎ. గఫూర్, రవీంద్ర నాధ్, పి.జమలయ్య. సిరసాని కోటి రెడ్డి, ఎ.ఎలమంద రావు,చలసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.



Next Story