రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది

by  |
రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది
X

దిశ,మునుగోడు: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మస్తాన్ అలీ కుమారుని మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు గురువారం నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో పంటలను రైతులు పూర్తిగా నష్టపోయారని ఆయన అన్నారు. సీసీఐ కేంద్రాల్లో వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని అన్నారు. అకాల వర్షాలతో రంగుమారిన పత్తిని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తేమ పేరుతో పత్తి రైతులను సీసీఐ ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. అదేవిధంగా వరి ధాన్యానికి రూ.2500 చొప్పున మద్దతు ధరను ప్రభుత్వం అందించాలని కోరారు. అకాల వర్షాలు వచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని తెలిపారు. పై డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు గురువారం నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed