అధికారులు చెప్పలేదు.. సీఎం వద్దన్న పని చేసిన రైతులు

by  |
అధికారులు చెప్పలేదు.. సీఎం వద్దన్న పని చేసిన రైతులు
X

“రైతులు నియంత్రిత పద్ధతుల్లో పంటలు సాగు చేయాలి. రైతులు ముందుకు రావాలి. అందరూ ఒకే పంట వేసి ఇబ్బంది పడొద్దు. మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటలు పండిస్తే మంచి ధరలు పొందవచ్చు. నియంత్రిత విధానంపై వ్యవసాయ, పౌరసరఫరాల మంత్రులు, శాస్త్రవేత్తలతో చర్చించాం. ఈ ఏడాది ఏ పంటలు వేయాలి, ఎలా వేయాలో వ్యవసాయ అధికారులు సూచిస్తారు“. -గతేడాది మే 18న విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో : నియంత్రిత సాగు విధానంపై విస్తృతంగా సమావేశాలు నిర్వహించి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నప్పటికీ కేవలం ఒక్క ఏడాది మాత్రమే అది అమలైంది. కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ విధాన నిర్ణయం నుంచి పక్కకు తప్పుకున్నది. వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేయడానికి రైతు సమన్వయ సమితి ఏర్పాటు, వ్యవసాయ విస్తరాణాధికారుల నియమాకం, రైతు వేదికల నిర్మాణం లాంటి ఎన్నో చర్యలు తీసుకున్నా చివరకు అది విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. ప్రతీ ఏటా యాసంగి, వానాకాలం పంటలకు వ్యవసాయ శాఖ వార్షిక ప్రణాళికను రూపొందించినా క్షేత్రస్థాయిలో మాత్రం పంటల సాగు దానికి భిన్నంగానే జరుగుతున్నది.

రైతుబంధు రూపంలో ప్రభుత్వం నుంచి సాయం పొందుతున్న రైతులు పంటల సాగు విషయంలో మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవడంలేదు. వ్యవసాయ శాఖ అధికారులు సైతం రైతులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వార్షిక ప్రణాళికతో సంబంధం లేకుండా రైతులు వారి ఇష్టానుసారమే పంటలు వేస్తున్నారు. అనేక నిర్ణయాల తరహాలోనే నియంత్రిత పంటల సాగు నిర్ణయం కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగించింది. ఉచిత యూరియా, క్రాప్ కాలనీలు, సన్న బియ్యాలు, వెద పద్ధతి, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట లాంటివన్నీ వృథా ప్రయాసలుగానే మిగిలిపోయాయి. ఒక దశలో ప్రధానిని సైతం కలిసిన సీఎం కేసీఆర్ దేశమంతా క్రాప్ కాలనీలు పెట్టే విధానంపై వివరించారు. చివరకు తెలంగాణలోనే అది ఆచరణలోకి రాకుండాపోయింది.

తాజాగా వానాకాలం పంటల వార్షిక ప్రణాళికను పరిశీలిస్తే ప్రభుత్వం టార్గెట్‌కు భిన్నంగా సాగవుతున్నది. మొక్కజొన్న విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా సాగు వద్దంటూ రైతులకు వరుసగా రెండు సీజన్‌లలో చెప్పినా ఇప్పుడు మాత్రం అది ఏకంగా ఆరున్నర లక్షల్లో సాగవుతున్నది. ఇదే తరహాలో రాష్ట్రంలో వివిధ రకాల పంటలు ప్రభుత్వ టార్గెట్‌తో సంబంధం లేకుండా సాగవుతున్నాయి. నియంత్రిత సాగుపై శాస్త్రవేత్తల మొదలు వ్యవసాయ విస్తరణాధికారుల వరకు రైతులకు అవగాహన కలిగిస్తారని, రైతు వేదికలను అందుకే నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా ఆచరణ మాత్రం ఎక్కడ గొంగళి అక్కడ తరహాలనే ఉండిపోయింది. నిర్ణయం ఎందుకు జరిగిందో, దాన్నుండి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయందనే రైతుల సందేహాలకు సర్కారు నుంచి సమాధానమే లేకుండా పోయింది.

వార్షిక పంటల ప్రణాళిక, క్షేత్రస్థాయిలో తాజాగా (ఆగస్టు 18 నాటికి) వివరాలను (లక్షల ఎకరాల్లో) పరిశీలిస్తే..

పంట టార్గెట్ సాగు
వరి 41.58 39.41
పత్తి 70.04 50.24
మొక్కజొన్న 2.27 6.04
వేరుశెనగ 0.39 0.15



Next Story

Most Viewed