కేంద్ర ప్రభుత్వ తీరుపై సూర్యాపేటలో రైతుల ఆందోళనలు..

by  |
కేంద్ర ప్రభుత్వ తీరుపై సూర్యాపేటలో రైతుల ఆందోళనలు..
X

దిశ, సూర్యా పేట: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిoచారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో రైతులు, పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన ఆందోళన బాటపట్టారు. సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ శవ యాత్రను నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద మోదీ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు జరిపారు. రైతు బజార్ సెంటర్ లోని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చేలా చూడమని రైతులు వినతి పత్రాన్ని ఇచ్చారు.

మరో వైపు నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచే గ్రామాల్లో రైతులు చావు డప్పు వేస్తూ కేంద్రం దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగలబెట్టారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిoచారు. తెల్లవారు జాము నుంచే ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాట పట్టింది.

సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు నియోజవర్గంలోని గ్రామగ్రామాన నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ దిష్టిబొమ్మను రైతులు దగ్ధం చేశారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి బియ్యాన్ని కేంద్రమే సేకరించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని రైతులు శాపనార్థాలు పెట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల వచ్చిన వేలాది మంది రైతులతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Next Story