సారూ.. మా వడ్లు కొనండి..

by  |
సారూ.. మా వడ్లు కొనండి..
X

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం లలో నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు అకాల వర్షాల కారణంగా ధాన్యం ఆరబోయలేక రైతన్నలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఖరీఫ్ లో పంట సాగు చేసిన రైతులు వరి కోసి ఇప్పటికే 20 రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్మశాన వాటికలో, రోడ్లపై, కల్లాల వద్దనే ధాన్యం ఆరపోసి రాత్రింబవళ్ళు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం ఎప్పుడు కొంటారో తెల్వక, మాటిమాటికి వచ్చి పోయే వర్షం ప్రభావానికి ఏం చేయాలో తేలిక తలపట్టుకుంటున్నారు. మరో వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరించి రాజకీయ లబ్ది కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దలారీల ఎంట్రీ..

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారన్న ఆశతో పడిగాపులు కాస్తున్న రైతుల వద్దకు దళారీ వ్యాపారులు చేరుతున్నారు. రైతులను దోచుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అమాయక రైతుల దగ్గర నుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. వేరేమార్గం లేక పంటకోసం తెచ్చిన అప్పు తీర్చడానికి తక్కువ రేటుకే ప్రయివేటు వ్యాపారస్థుల వద్ద అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, కొర్రీలు లేకుండా మద్దతు ధర కల్పించి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


Next Story

Most Viewed