సాంగ్లీ దారిలో ఇందూర్ పసుపు రైతులు

by  |
Yellow farmers
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పసుపు పంటకు (పచ్చ బంగారం) కు మంచి ధర రాకపోవడంతో ఇందూర్ రైతులు సాంగ్లీ బాట పడుతున్నారు. మార్కెట్‌లో పసుపు వ్యాపారులు ఆన్‌లైన్ ట్రేడ్‌లోనూ సిండికేట్ అయ్యారనే విమర్శలు వస్తుండడంతో తప్పని సరి పరిస్థితుల్లో పక్క రాష్ర్టం వైపు చూస్తున్నారు. నిజామాబాద్​ మార్కెట్​లో కొనుగోళ్ల ద్వారా వ్యాపారులతో పాటు కమీషన్ ఏజెంట్లే లాభపడుతుండడంతో రైతులు అటుగా చూస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికే నిజామాబాద్ మార్కెట్​కు పసుపు జోరందుకున్నా ధర మాత్రం 7,600 దాటడం దాటకపోవడం ఒకటైతే, అదే సమయంలో సాంగ్లీలో మాత్రం రూ.10 వేల నుంచి 14 వేల వరకు ధర పలుకుతుండడంతో రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ నామ్ ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా ఇతర రాష్ర్టాల ట్రేడర్లు మాత్రం ఇక్కడ కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇందూర్ వ్యాపారులు చెప్పిన ధరకే కొనుగోళ్లు జరుగుతున్నాయి. మార్కెట్ యార్డులో 50 మంది వ్యాపారులు కొనుగోళ్లకు లైసెన్స్ కలిగి ఉన్నా, వ్యాపారులకు, రైతులకు మధ్య 70 మంది వరకు కమీషన్ ఏజెంట్లు ఉన్నారు. ఈ నామ్ ద్వారా ఆన్ లైన్ ట్రేడింగ్ జరుగుతున్నా అందులోని పసుపు వ్యాపారులంతా నిజామాబాద్ కు చెందిన వారే. అందరూ కుమ్మక్కై ఆడిందే ఆటా.. పాడిందే పాటగా లావాదేవీలు జరుపుతున్నారు. జిల్లాకు చెందిన నేతలు, రైతు సంఘాల వారు, రాజకీయ నాయకులు పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర గురించి మాట్లాడడం తప్ప ఆన్ లైన్ ట్రేడింగ్ లో ఇతర రాష్ర్టాల వ్యాపారులతో క్రయ విక్రయాలు జరగాలని, మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్ల వ్యవస్థ ఏంటని మాత్రం ప్రశ్నించే వారే లేరు. దీంతో పసుపు రైతులు ఏటా విపరీతంగా నష్టపోతూనే ఉన్నారు.


Next Story