దొండ తోటపై ప్రతీకారమా?

by  |
దొండ తోటపై ప్రతీకారమా?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సాధారణంగా పగ, ప్రతీకారం అనేది మనకు హాని తలపెట్టిన వారిమీద తీర్చుకుంటాం.అలా కుదరకపోతే వారికి బాగా కావాల్సిన వ్యక్తుల మీద రివెంజ్ చూపిస్తాం. కానీ,ఇక్కడ గుర్తుతెలియని దుండగులు సాధారణ రైతుకు చెందిన దొండ తోటపై తమ ప్రతీకారం తీర్చుకున్నారు.ఈ విచిత్రమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో గురువారం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.

వివరాల్లోకివెళితే.. జిల్లాలోని మాక్లూర్ మండలం కృష్ణానగర్ గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి తన ఎకరం భూమిలో దొండకాయ సాగు చేపట్టాడు. పంట కాపు దశకు చేరుకుని ఇప్పుడిప్పడే కాయలు కాస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొండ కాయ తీగలను కోసివేశారు. దీంతో పంట మొత్తం నాశనం అయ్యిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.
తాజా దుశ్చర్యతో మిగతా రైతులు కూడా భయాందోనళకు గురవుతున్నారు. చుట్టు పక్కల చాలా మంది పందిరి సాగు విధానంలో కూరగాయలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి తెరుకుని కాపు దశలో ఉన్న పంటను చేతికి రాకుండా చేయడంతో ఎకరానికి రూ.3 నుంచి 4లక్షల నష్టం వాటిల్లిందని సుబ్బారావు వాపోయాడు. ఈ విషయంపై తోటి రైతులతో కలిసి సుబ్బారావు మాక్లూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ పని చేసిన దుండగులకు కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా తమ పంటలకు రక్షణ కల్పించాలని కోరారు.

Next Story