పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..

by  |
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..
X

దిశ నారాయణఖేడ్: భారీ వర్షాలతో పంట పూర్తిగా దెబ్బ తినడంతో తీవ్ర ఆవేదన చెందిన ఓ రైతు పురుగుల మందు సేవించి పొలంలోనే మరణించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రమైన కల్హేర్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల గుమ్మడి బాలయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న ఒక ఎకరం పొలంలో సోయా పంటను ఈ ఏడాది సాగు చేస్తున్నాడు. దీంతోపాటు ఇతరుల భూమిని తీసుకొని కౌలుకు చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయంలో నష్టాలు వస్తుండటంతో సుమారు ఐదు లక్షల వరకు అప్పు అయినట్టు సమాచారం. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో ఈ ఏడాది దిగుబడి అధికంగా పొందవచ్చని ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎకరం వ్యవసాయ భూమిలో ఉన్న సోయా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఓ వైపు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవడం, మరో వైపు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక పోవడంతో రైతు ఆవేదనకు గురయ్యాడు. దీంతో ఆదివారం తన సొంత వ్యవసాయ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడికి భార్య శ్యామల , కుమారుడు రాకేశ్, కూతురు మీనాక్షి ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Next Story