ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కుప్పకూలిన రైతు..

by  |
heart attack
X

దిశ, సిద్దిపేట: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. బద్దిపడగ‌ గ్రామానికి చెందిన వడ్లూరి రాములు అనే కౌలు రైతు అదే గ్రామానికి చెందిన దండ్ల ఎల్లయ్య దగ్గర ఎకరం పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. 10 రోజుల క్రితం రాములు పాలమాకుల సహకార సంఘం ఆధ్వర్యంలో బద్దిపడగ గ్రామంలోని రాజరాజేశ్వర దేవాలయం బండపై ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకు వచ్చాడు.

ఆయనకు సంబంధించిన ధాన్యం తేమ ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజు ఆర పెడుతూ అక్కడే ఉంటున్నాడు. గురువారం సాయంత్రం అతని ధాన్యం సీరియల్ రావడంతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అతనికి బార్దన్ సంచులు ఇచ్చి నింపమన్నారు. ఆరబోసిన ధాన్యాన్ని దగ్గరికి చేసి నింపుతున్న క్రమంలో రాములకు చాతిలో నొప్పి వస్తుందని అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికి తేరుకొని మళ్లీ పనులు చేస్తున్న క్రమంలో గుండె పోటు రావడంతో వెంటనే 108అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

గుండెపోటుకు గురైన రాములు‌ను చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అతని మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రాములకు భార్య లత‌తో పాటు నలుగురు కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed