ఆ బాధ భరించలేక రైతు ఆత్మహత్య

by  |
ఆ బాధ భరించలేక రైతు ఆత్మహత్య
X

దిశ, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఏదో ఒక జిల్లాలో ఇటువంటి విషాద ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అప్పుల బాధ తాళలేక ఓ రైతు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం పాపగల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వస్పరి నాగయ్య (42) తనకున్న 5 ఎకరాల్లో పత్తి, వరి పంట సాగు చేశాడు. మరో రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందుకు సుమారు రూ. 5 లక్షల వరకు అప్పులు చేశాడు.

గత మూడేళ్ళుగా ఆశించిన స్థాయిలో పత్తి దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరిగాయి. ఈ సారి సాగుచేసిన వరి పంటను కూడా కొనము అని ప్రభుత్వం చెప్పడంతో అప్పుల వారు ఒత్తిడి పెంచారని భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకెళ్లిన నాగయ్య.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో మంగళవారం పొలంవద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించారని కుటుంబీకులు కన్నీరుపెట్టుకున్నారు. రైతు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు.

Next Story

Most Viewed