ఒంటిపై డీజిల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం..

by  |
ఒంటిపై డీజిల్ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం..
X

దిశ సిద్దిపేట: తాను కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ఆందోళనకు గురైన రైతు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రమైన నంగునూరులో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని కథనం ప్రకారం మండలం లోని బద్దిపడగ పరిధిలోని ఉర తండాకు చెందిన బానోతు అంజయ్య (54 )అనే గిరిజన రైతు రాంపూర్ శివారులో 6.06 ఎకరాల భూమిని గత ముప్పై ఏళ్ల క్రితం రాంపూర్ గ్రామానికి చెందిన గుడిపల్లి యాదగిరి, పోచయ్య, అశోక్, చంద్రకళ దగ్గర కొనుగోలు చేశారు.

అ భూమి కొనుగోలు చేసిన తర్వాత కేవలం 3. 14 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసి మిగతా భూమి చేయడం లేదన్నారు. తాను కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం రెవెన్యూ కార్యాలయంలో బాధితుడు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్నారు. తాను కొనుగోలు చేసిన భూమికి మూడు లక్షలు లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రెవెన్యూ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు అంజయ్య తెలిపారు. తమ భూమికి సంబంధించి మీసేవ కేంద్రంలో కూడా పహానీలు రాకుండా రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. తాను కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కావడం లేదని మానసిక ఆందోళనకు గురైన అంజయ్య మంగళవారం ఉదయం నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడే ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడగా సిబ్బంది అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న రాజగోపాల్ పేట ఎస్ఐ మైపాల్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడు అంజయ్య తో మాట్లాడి భూమికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే లాయర్ ని పెట్టుకుని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే సమస్య పరిష్కారం కాదన్నారు. కోర్టు లింకులు తొలగించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయమై స్థానిక తహశీల్దార్ భూపతి ని వివరణ కోరగా భూమికి సంబంధించి కోర్టు లో కేసు ఉన్నందున రిజిస్ట్రేషన్ కావడం లేదని కోర్టు సమస్య పరిష్కారం చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. రైతు అంజయ్య భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తాము కానీ, తమ సిబ్బంది కానీ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పారు.


Next Story

Most Viewed