లోటస్ పాండ్ వద్ద సందడి.. అభిమానుల కోలాహలంతో..

by  |
లోటస్ పాండ్ వద్ద సందడి.. అభిమానుల కోలాహలంతో..
X

దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవాళ సాయంత్రం ఖమ్మం వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ ప్రకటనకు ఆమె ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ సభపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. షర్మిల కొత్త పార్టీ పేరు ఏంటి?.. ఆమె ప్రసంగం ఎలా ఉంటుంది?.. ఎవరిపై విమర్శనస్త్రాలు సంధిస్తారు? అనే దానిపై చర్చ జరుగుతోంది.

ఈ సభకు షర్మిల తల్లి విజయమ్మ కూడా హాజరవుతుండటంతో ఆసక్తి మరింత పెరిగింది. అయితే షర్మిలకు దారిపొడవునా ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఉదయం నుంచే లోటస్‌పాండ్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. అభిమానుల కోలాహలంతో లోటస్ పాండ్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి షర్మిల ఖమ్మం బయలుదేరనున్నారు. ఆమె వెంట వాహనాల్లో కార్యకర్తలు ర్యాలీగా వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత బహిరంగ సభ జరగనుంది. షర్మిల ప్రకటించబోయే పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని తెలుస్తోంది. ఇక ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులతో పార్టీ జెండా ఉంటుందని సమాచారం.



Next Story