కరోనాతో ప్రఖ్యాత చిత్రకారుడు చంద్రశేఖర్ కన్నుమూత

by  |
Famous painter Chandrasekhar
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో సామాన్య జనాలతో ప్రముఖులూ తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా.. ప్రముఖ చిత్ర కారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇలస్ట్రేషన్స్ కార్టూన్లతో అలరించిన మహా చిత్రకారులు చంద్రశేఖర్ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన సికింద్రబాద్‌లోని RK మథర్ థెరిస్సా రీహాబిలిటేషన్ సెంటర్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కృష్ణచైతన్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కాగా.. వరంగల్ జిల్లా నర్సింహుల పేట మండలం పెద్దముప్పారంలో చంద్రశేఖర్ 1946, ఆగష్టు 25న సోమలక్ష్మి, రంగయ్య దంపతులకు జన్మించాడు. ఫైన్ ఆర్ట్స్‌లో చందు పట్టభద్రుడు. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆర్టిస్ట్ కమ్‌ డిజైనర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశాడు. కొన్ని వేల కథలకి చిత్రాలు వేశాడు. ఎన్నో పుస్తకాలకు ముఖచిత్రాలు గీశాడు. వేలకొద్ది కార్టూనులు గీశాడు. చిత్రకళ మీద వ్యాసాలు, సమీక్షలు, కవితలు, 125కు పైగా కథలు వివిధ పత్రికలలో ప్రచురించాడు.

ఆయన మొదటి కార్టూను 1959లో ఆంధ్రపత్రికలో, మొదటి కథ 1961లో ఆంధ్రప్రభలో అచ్చయ్యాయి. ఇతడు జ్యోతి, యువ మాసపత్రికలలో ఆర్టిస్టుగా, స్వాతి మాసపత్రిక, మయూరి వారపత్రిక, పుస్తక ప్రపంచం మాసపత్రికలలో సంపాదక వర్గంలో పనిచేశాడు. 1970 నుండి 1976 వరకు విప్లవ రచయితల సంఘంలో సభ్యుడుగా చేరి, విరసం కళాకారుడిగా ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించాడు. 20 సినిమాలకు, 6 డాక్యుమెంటరీ చిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేశాడు. 2 డాక్యుమెంటరీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇంద్రధనుస్సు, వెన్నెలవేట మొదలైన టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించాడు. చందు మరణ వార్త తెలిసిన విరసం నేతలు, సినీ ప్రముఖులు, పత్రికల ప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Next Story