అంత్యక్రియలు నిర్వహించేందుకు అవస్థలు..

by  |
river, corpse
X

దిశ, తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బొంకూరు గ్రామ పంచాయతీలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన హరిజన్ పెంటప్ప(45) అనే వ్యక్తి తాండూరు పట్టణంలోని నాపరాయి పాలిసింగ్ యూనిట్‌లో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. బుధవారం రోజుగానే యూనిట్‌కు వెళ్లి పనిచేస్తుండగా పెంటప్ప చాతి నొప్పి అంటూ కిందపడిపోయాడు. గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పెంటప్పను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

గ్రామానికి సరైన రవాణా వ్యవస్థ లేక మృతదేహాన్ని వాగులో నలుగురు వ్యక్తులు మోసుకుంటూ తీసుకువెళ్ళారు. బొంకూరు గ్రామానికి వంతెన నిర్మించాలని గతంలో అనేకసార్లు విన్నవించినా, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని కుటుంబసభ్యులు, గ్రామస్తులు వాపోయారు. సెప్టెంబర్ 4న ఇదే గ్రామానికి చెందిన విద్యార్థి హారిక(11) అనే చిన్నారి అస్వస్థతకు గురై తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు వెళ్తుండగా, వాగు పొంగి ప్రవహిస్తుండడంతో దాదాపు మూడు కిలోమీటర్లు పంట పొలాల మధ్య భూజాన వేసుకొని నడుచుకుంటూ తీసుకెళ్లినా, సమయానికి వైద్యం అందక హారిక మృతి చెందింది. ఈ సంఘటన మరవకముందే మరొక ప్రాణం పోవడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. కాగా, మృతుడు పెంటప్పకు భార్య హరిజన్ శివమ్మ, ఒక కూతురు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో ఉన్నటువంటి వాగుపై వంతెన నిర్మంచాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed