అరాచకం : కుల బహిష్కరణ.. ఆపై ఇంట్లోకి చొరబడి బీభత్సం!

by  |
అరాచకం : కుల బహిష్కరణ.. ఆపై ఇంట్లోకి చొరబడి బీభత్సం!
X

దిశ, జగిత్యాల : అభివృద్ధిలో గ్రామాలు, పల్లెలు దూసుకుపోతుంటే ఇంకా కొన్ని పల్లెల్లో కుల పిచ్చి మత్తు వీడటం లేదు. తాజాగా జగిత్యాల రూరల్ మండలం మోతే గ్రామంలోని బాగోజి పల్లెలో ప్రస్తుత సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగుచూసింది. కుల బహిష్కరణ పేరుతో ఓ కుటుంబంపై కొందరు దుండగులు రెచ్చిపోయారు. ఇంట్లోకొ చొరబడి వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా, బాధితులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ అరాచకం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకివెళితే.. జగిత్యాల జిల్లాలోని బాగోజి పల్లెలో ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ పేరుతో దూరం పెట్టారు. భూ పంచాయితీ వివాదంలో కొండపల్లి నీలయ్య కుటుంబంపై గ్రామంలోని కులపెద్దలు ఆంక్షలు విధించారు. వీరిని గ్రామంలో జరిగే ఏ కార్యక్రమాలకు పిలవద్దని ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన నీలయ్య జగిత్యాల రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం కిందట ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా గ్రామ పెద్దలు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కులపెద్దలు మద్దతు దారులు నీలయ్య కుటుంబంపై దాడికి పాల్పడి ఇంట్లోని వస్తువులన్నీ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్‌ ఎస్‌ఐ చిరంజీవి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దాడిలో పాల్గొన్న గ్రామస్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు. గ్రామంలో గొడవ జరగకుండా ముందస్తుగా పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed