'చెత్త' లెక్కలతో ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు బురిడీ..?

by  |
చెత్త లెక్కలతో ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు బురిడీ..?
X

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ మున్సిపాలిటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వురుగా సేకరించాలని నిర్ణయించింది. చెత్త సేకరణకు అనుగుణంగా ఆ మున్సిపాలిటీకు ర్యాంకులను ఇవ్వనుంది. ఆ ర్యాంకుల కోసం అధికారులు పడుతున్న తాపత్రయం అంత ఇంత కాదు. అధికారులు తప్పడు లెక్కలు చూపిస్తున్నారని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ర్యాంకులు అవే వస్తాయంటున్నారు. తడి, పొడి చెత్తను లెక్కించేందుకు ఎక్కడ వేబ్రిడ్జీలు లేవు. కానీ అంచనాలతో తడి, పొడి చెత్త సేకరణను లెక్కలు వేస్తోంది. దీంతో అటు ప్రభుత్వాన్ని.. మరో వైపు ప్రజాప్రతినిధులను తప్పుదోవపట్టిస్తున్నారు.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులున్నాయి. ఎక్కడ కూడా చెత్త డపింగ్ కేంద్రాలు లేవు. ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. ఇలాంటి మున్సిపాలిటీలో తడి చెత్త 16.74 టన్నులు, పొడి చెత్త 4.78 టన్నులు మొత్తం 24 టన్నుల చెత్తను సేకరిస్తున్నామని లెక్కలతో సహా మున్సిపాలిటీ అధికారులు వివరిస్తున్నారు. ఈ లెక్కలపై మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సంపూర్ణ రెడ్డి బహిరంగాగనే విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా తప్పుడు లెక్కలు చూపిస్తూ సంతకాలు సేకరించడం సరైంది కాదంటున్నారు. మీ మెప్పుకోసం మాతో తప్పు చేయించడం ఎంటని ప్రశ్నిస్తున్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలో డపింగ్ యార్డుల ఏర్పాటు చేయలేదు. రెండు రోజులకు ఒక్కసారి ఆటోలో సేకరించే చెత్తను నాగోల్ సమీపంలోని డపింగ్ కేంద్రానికి తరలిస్తారు. రిక్షా ద్వారా రోజువారీగా సేకరించే చెత్త బ్రహ్మణపల్లి డీఆర్సీలో కాల్చి వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు.

డపింగ్ యార్డులు ఎక్కడ…?

ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకంగా డపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రి సూచించారు. కానీ ఏడాది పూర్తైనప్పటికీ సేకరించిన చెత్తను వేసేందుకు స్థలాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమైయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో కలిపి 7 కార్పొరేషన్లు, 25 మున్సిపాలిటీలున్నాయి. ఏ మున్సిపాలిటీలో చెత్త సేకరించే వాహనాలు, డపింగ్ కేంద్రం, వేబ్రిడ్జీలు లేవు. కానీ అంచనాల ఆధారంగా తప్పుడు లెక్కలను చూపిస్తూ ఉన్నతాధికారులను మభ్యపెట్టేందుకు క్షేత్రస్థాయి అధికారులు లెక్కల గేమ్ ను ఆడుతున్నారు. చెత్త సేక రణ పేరుతో రూ.లక్ష నిధులను వెచ్చిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.

ప్రజలతో పాటు వ్యాపారులు రోడ్లపై చెత్త వేస్తే రూ.500నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించాలని సూచించారు. కౌన్సిలర్లతో కమిటీలు వేశారు. వీరు వారానికి రెండు రోజులు ఆయా ప్రాంతాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అధికారులు, కమిటీల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణ ప్రజలు ఇష్టానుసారంగానే చెత్త వేస్తున్నారు. అక్కడక్కడ రీసైక్లింగ్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికి ఇప్పటి వరకు ఏలాంటి పురోగతి లేకపోవడం గమ నార్హం. ఎక్కడ జరిమానాలు వేసిన దాఖలాలు లేవు.

ఆటోల ఆధారంగానే చెత్త లెక్కింపు….

స్వ‌చ్ఛ ఆటోల కెపాసిటీ ఆధారంగా త‌డిపొడి చెత్తను లెక్కిస్తున్నాం. ఒక్కో ఆటోలో యావరేజ్‌గా 1.2ట‌న్నుల చెత్త వ‌స్తుంది. తుర్క‌యంజా ల్‌లోని 24 వార్డుల నుంచి రోజుకు పొడి చొత్త 7.8ట‌న్నులు, త‌డి చెత్త 4.2 ట‌న్నులు వ‌స్తోంది. స్వ‌చ్ఛ్ స‌ర్వేక్ష‌న్‌లో భాగంగా తుర్క‌యంజాల్‌ను స్టార్ 3 చెత్త ర‌హిత ప‌ట్ట‌ణంగా మూడోసారి దరఖాస్తు చేసుకున్నాం. తుర్క‌యంజాల్‌ను బ‌హిరంగ మ‌ల విసర్జ‌న ర‌హిత ప‌ట్ట‌ణంగా గుర్తించేందుకు డిక్ల‌రేష‌న్ ఇచ్చాం.
– హ‌రీశ్‌, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్‌, తుర్కయంజాల్ మున్సిపాలిటీ

ఎక్కడా వేబ్రిడ్జీలు లేవు..

పారిశుధ్యంలో ర్యాంకింగ్ కోసం చెత్త సేకరణ లెక్కలు వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారు. వివరాలను ఏవిధంగా తీసుకున్నారని కమిషనర్ను నిలదీశాము. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో చెత్త సేకరణ సక్రమంగా లేదు. అలాంటప్పుడు చెత్త సేకరిస్తున్నారని ఎలా చెబుతారని ప్రశ్నించాము. ఇప్పటి వరకు సంతకాలు చేయకుండానే రిపోర్ట్ ను వెనక్కి పంపించాము. నాకు తెలిసి రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో వేబ్రిడ్జీలు లేవు. డపింగ్ యార్డులు లేవు. ఇలాంటి సందర్భాల్లో అధికారుల మెప్పు కోసం తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు.
– సంపూర్ణ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ పెద్ద అంబర్ పేట్



Next Story